ప్రభుత్వం అంటే ఇదీ.. అంటూ జాతీయ మీడియా ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలో ఉన్న కూటమి సర్కారుపై ప్రశంసలు గుప్పించింది. నేటితో చంద్రబాబు పాలనకు పది నెలలు పూర్తయిన నేపథ్యంలో పలు మీడియా చానెళ్లు ఆయన పాలన.. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, పెట్టుబడులు సహా.. వివిధ అంశాలను ప్రస్తావించాయి. కొన్ని పత్రికలు.. బాబు మారలేదు.. అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. డిజిటల్ విప్లవం, ఐటీ, పెట్టుబడుల అంశాలను ప్రస్తావించాయి.
ఈ సందర్భంలోనే కొందరు విశ్లేషకులు 1995 పాలనను పోల్చుతూ.. పాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారని.. అయితే.. అప్పటికి.. ఇప్పటికి కొంత మార్పు అయితే కనిపించిందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రజల వద్దకు పాలన పేరుతో ఒకప్పుడు తీసుకువచ్చిన వ్యవస్థ సక్సెస్ కావడంతో ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నారని.. అయితే, అప్పట్లో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని పంపిస్తే.. ప్రస్తుతం సీఎం చంద్రబాబు స్వయంగా ప్రజల వద్దకు వెళ్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరీ ముఖ్యంగా ‘విజన్’ అనే మాట ద్వారానే చంద్రబాబు గతంలో సక్సెస్ అయ్యారన్నది కూడా.. పత్రికలు పేర్కొంటున్న వాస్తవం. దీనిని ఆయన ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని.. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యం పెట్టుకుని ఆయన వేస్తున్న అడుగులు రాష్ట్రానికి మరిన్ని మేళ్లు చేస్తాయని చెబుతున్నాయని చెబుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రవచిస్తున్న పీ4 విధానం సాకారం అయితే.. రాష్ట్రంలో పేదరిక నిర్మూల సాధ్యమైనంత వరకు తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొనడం గమనార్హం.
గత ప్రభుత్వాలకు.. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలకు కూడా.. చంద్రబాబు చాలా వ్యత్యాసం చూపిస్తు న్నారని కూడా.. జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం. ఒకప్పుడు మిత్రపక్షాలైన కమ్యూనిస్టులను ఆయన పెద్ద పట్టించుకున్న పరిస్థితి కనిపించేది కాదని.. కానీ, ఇప్పుడు కూటమిప్రభుత్వంలోని మిత్ర పక్షాలకు అన్ని స్థాయిల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తున్నారని పత్రికలు పేర్కొంటున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీ వేస్తున్న అడుగులు మిత్రపక్షాల మధ్య సఖ్యతను ఈ సందర్భంగా ప్రస్తావిస్తుండడం విశేషం.