మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్ గా ఉండేవారు. అయితే.. గత ఏడాది ఎన్నికల సమయంలో ఆయన తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. చివరి నిముషంలో చంద్రబాబు జోక్యం కారణంగా టికెట్ కోల్పోయారు. జనసేన పార్టీకి మచిలీపట్నం పార్లమెం టు టికెట్ను కేటాయించారు. దీంతో చంద్రబాబు.. ఆయనకు నామినేటెడ్ పదవిని ఇస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. కొనకళ్లకు ఏపీఎస్ ఆర్టీసీ బోర్డు చైర్మన్ పదవిని ఆఫర్ చేశారు. ఇది జరిగి కూడా ఆరు మాసాలు అయిపోయింది. ప్రస్తుతం ఆర్టీసీ కార్పొరేషన్ బోర్డు చైర్మన్గా కొనకళ్ల వ్యవహ రిస్తున్నారు. అయితే.. ఆయన మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి.. తన ఛాంబర్కు వచ్చారు. నియామకం జరిగి.. బోర్డు సభ్యులు కూడా ఉండి ఆరు మాసాలు దాటిపోయినా.. ఆయన పెద్దగా అటు వైపు చూడడం లేదు.
అంతేకాదు.. ఆర్టీసీ సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అటు డ్రైవర్లు, సిబ్బంది, ఇటు.. బోర్డు సభ్యులు కూడా.. కింకర్తవ్యం అంటూ. దిక్కులు చూస్తున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? అనేది ప్రశ్న. దీనికి ప్రధాన కారణం.. కొనకళ్లకు ఇస్తామన్న మరో హోదా ఇవ్వకపోవడమేనని పార్టీ వర్గాలు సహా.. బోర్డు సభ్యులు సైతం చెబుతున్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవితో పాటు.. ఈ పదవికి కేబినెట్ హోదా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు.. చెక్ పవర్ కూడా.. ఇవ్వాలి.
ఈ విషయాలను పదవిని ఇస్తున్నప్పుడే.. ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఇప్పటి వరకు.. ఆ దిశగా అడుగులు మాత్రం వేయలేదు. అంటే.. కొనకళ్లకు చైర్మన్ పదవి ఇచ్చినా.. ఆ పదవికి తగిన విధంగా దక్కే హోదాలు మాత్రం ఆయన దరి చేరలేదు. దీనిపై ఇప్పటికే ఒకటికి రెండు సార్లు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ, ప్రయోజనం లేకుండా పోవడంతో ప్రస్తుతం కొనకళ్ల ఇంటికే పరిమితమయ్యారు. ఇది ఆర్టీసీ వర్గాల్లోనూ.. ఇటు.. పార్టీలోనూ చర్చనీయాంశం అయింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాన్న వాదనా వినిపిస్తోంది.