తెలంగాణ సర్కారుకు డబుల్ షాక్.. ‘సెంట్రల్’ చెట్ల కొట్టివేతపై స్టే

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల విషయంలో తెలంగాణ సర్కారుకు గురువారం డబుల్ షాక్ తగిలింది. ఈ భూముల పరిదిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చెట్ల నరికివేతపై ఇటు తెలంగాణ హైకోర్టుతో పాటు అటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఇటు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కాసేపటికే.. హైకోర్టు మాదిరే సుప్రీంకోర్టు కూడా చెట్ల నరికివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా గత కొన్ని రోజులుగా సెంట్రల్ వర్సిటీ భూముల్లో చెట్ల తొలగింపునకు బ్రేకులు పడినట్టైంది.

సెంట్రల్ వర్సిటీ పరిధిలోని ఆ 400 ఎకరాల ప్రభుత్వానివేనని వాదించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని పారిశ్రామిక అవసరాలకు వాడుకునే నిమిత్తం భూముల చదును కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ చర్యలపై వర్సిటీ విద్యార్థులు, పలు ప్రజా సంఘాలతో పాటు విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోెళనలకు దిగాయి. అయినా కూడా ప్రభుత్వం ముందడుగే వేసింది. ఈ క్రమంలో బుధవారం పలు సంఘాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం కూడా వరుస విచారణ చేపట్టింది. గురువారం మధ్యాహ్నం ఈ పిటిషన్ల విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటివరకు భూమి చదును, చెట్ల నరికివేతలను నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఇదే విషయంపై పలువురు న్యాయవాదులు గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోజాలరంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ వర్సిటీ భూముల వ్యవహారం చాలా సీరియస్ వ్యవహారమని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కంచ గచ్చిబౌలి పరిధిలోని ఈ భూముల్లో చెట్ల నరికివేతను తక్షణమే నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తాము సుమోటోగానే విచారణ చేపట్టామని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా భూమి చదును, చెట్ల నరికివేతలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.