నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే. రాష్ట్ర విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ఏపీ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించగా…రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండరాదన్న భావనతో…రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారు. తొలి ఐదేళ్లతో పాటు రెండో ఐదేళ్లూ చంద్రబాబే సీఎంగా ఉండి ఉంటే… అమరావతి ఎలా ఉండేదన్నది ఇప్పటికీ ఊహకు అందడం లేదు.
తాజాగా మరో ఐదేళ్ల పాటు అధికారం చేజిక్కిన నేపథ్యంలో అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు వ్యూహం సిద్ధం చేశారు. అందులో భాగంగా తన శాశ్వత నివాసాన్ని ఆయన అమరావతిలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. రాజధాని పరిధిలో వెలగపూడి పరిసరాల్లోని ఈ6 రోడ్డును ఆనుకుని బాబు ఇల్లు రూపొందనుంది.
చంద్రబాబుకు హైదరాబాద్ లో స్థిర నివాసం ఉంది. రాజకీయాల్లోకి వచ్చిందే మొదలు ఆయన హైదరాబాద్ లోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర విభజనకు కాస్త అటుఇటూగా ఆ నివాసం పాతదైపోగా… దానిని కూల్చివేసి దాని స్థానంలోనే కొత్త ఇల్లు కట్టుకున్నారు. అయినా కూడా తన సొంత రాష్ట్రంలో, తన పాలనలోనే ఏపీలో… అది కూడా తనకు, తన కుటుంబానికి ఓటు హక్కు కలిగిన అమరావతి పరిధిలో తనకు శాశ్వత నివాసం ఉండాల్సిందేనని కూడా చంద్రబాబు తలచారు. అనుకున్నదే తడవుగా అమరావతిలో అది కూడా… అమరావతిలోని ప్రభుత్వ భవన సముదాయం సచివాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఓ 5 ఎకరాల భూమిని గతేడాది చివరలోనే కొనుగోలు చేశారు. అందులోనే తన నివాసంతో పాటుగా తన క్యాంపు కార్యాలయం, సిబ్బంది, పార్కింగ్ తదితరాలన్నింటికీ సరిపడేలా ఓ బడా ఇంటినే నిర్మించుకోవాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు.
ఈ ఇంటికి సంబందించిన ప్లాన్ దాదాపుగా ఖరారు అయిపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ సిబ్బంది ఆ స్థలం వద్దకు వచ్చి పరిశీలన చేశారు. అప్పటికే రూపొందిన ప్లాన్ పట్టుకుని మరీ వారు పరిశీలన పూర్తి చేశారు. ఆ వెంటనే ఆ స్థలంలో నిర్మాణ పనులను మొదలుపెట్టేందుకు అనుకూలంగా ఉండేలా స్థలాన్ని చదును చేసే పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కాగానే.. ఏప్రిల్ 9న మంచి ముహూర్తం ఉన్నందున అదే రోజున చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి భూమి పూజ చేయాలని నిర్ణయించకున్నట్లు సమాచారం. అమరావతి పనుల పున:ప్రారంభం కోసం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్న చంద్రబాబు… ఆ లోగానే తన సొంతింటి భవన నిర్మాణ పనులను మొదలుపెట్టాలని నిర్ణయించుకోవడం గమనార్హం.