కోర్టుల‌తో ప‌రిహాస‌మా?: ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో సుప్రీం ఫైర్

తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్యేల అన‌ర్హత పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తివాదులైన జంపింగ్‌ ఎమ్మెల్యేల త‌ర‌ఫున న్యాయ‌వాదులు.. నాలుగు వారాల‌స‌మ‌యం కోరారు. తాము అఫిడ‌విట్‌లు వేసేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జస్టిస్ బీఆర్ గ‌వాయ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “కోర్టుల‌తో ప‌రిహాస‌మా? మా స‌మ‌యాన్ని వృధా చేస్తారా?” అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేయ‌క‌పోతే.. భ‌విష్య‌త్తులో ఏ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు గెలిచినా ఇలాంటి ప‌రిస్థితులే ఎదురుకానున్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ పార్టీపై గెలిచి.. త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయార‌ని.. ఇది ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం తీవ్ర నేర‌మ‌ని తెలిపారు. ఈ విష‌యంపై హైకోర్టును కూడా ఆశ్ర‌యించామ‌న్నా రు. అయితే.. దీనిని స్పీక‌ర్ కోర్టులో ప‌రిమితం అయింద‌న్నారు.

స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. అందుకే కోర్టును ఆశ్ర‌యించామ‌న్నారు. దీనిపై త్వ‌ర‌గా తేల్చాలని తెలిపారు. గ‌తంలోనే ప్ర‌తివాదుల‌కు 4 వారాల స‌మ‌యం ఇచ్చార‌ని, ఇప్పుడు అంత స‌మ‌యం అవ‌సరం లేద‌న్నారు. పైగా ఖైర‌తాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచిన దానం నాగేంద‌ర్‌.. ఎంపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశార‌ని.. ఓడిపోయిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటూ.. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నార‌ని తెలిపారు.

ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని బీఆర్ఎస్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి జంపింగుల త‌ర‌ఫు న్యాయ‌వాది త‌మ‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా కోర్టుల‌తో ఆడుకుంటున్నారా? కోర్టులంటే ప‌రిహాస‌మా? అని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు.