‘అనంత’లో జేసీ… ‘గోదారి’లో ఆర్ఆర్ఆర్

రాజకీయాల్లో కొందరు నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు అన్నింటా ముందుండాలని కోరుకోని నేత ఉండరు గానీ… ఆ దిశగా మనమే అడుగులు ఎందకు వేయకూడదు అని భావించే వారు మాత్రం అరుదే. అలాంటి వారిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అందరికంటే ముందు ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణ రాజు కూడా చేరిపోయారు.

పల్లెలు పట్టణీకరణ దిశగా సాగుతున్నాయి. పల్లెల్లోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెరుగుతోంది. ఇందులో చెత్త సేకరణ అన్నది కీలక భూమిక పోషిస్తోంది. చెత్తను ఇష్టానుసారంగా పడేస్తే…పారిశుద్ధ్యం అన్నదే కనపడదు. ఇదే విషయాన్ని చాలా కాలం క్రితమే చెప్పిన జేసీ… తాడిపత్రిలో చెత్త సేకరణను ఆయన ఓ ఉద్యమంలా చేపట్టారు. చెత్త సేకరణతో పాటు మునిసిపల్ చట్టాలను పక్కాగా అమలు చేస్తూ… తాడిపత్రిని అభివృద్ధి బాటలో నడిపే దిశగా ఆయన కీలక చర్యలకే శ్రీకారం చుట్టారు. అందులో చెత్తను ఎక్కడ పడితే అక్కడ విసిరివేసే వారిపై జరిమానాలు వేస్తామంటూ కూడా ఆయన గతంలో ఓ కండీషన్ పెట్టారు.

తాజాగా రఘురామకృష్ణరాజు కూడా తన నియోజకవర్గం ఉండి పరిదిలో ఈ తరహాలోనే ఓ కొత్త నిబంధనను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉగాది నుంచి చెత్తను చెత్త సేకరణ వాహనాల్లో కాకుండా పంట కాలువల్లో పడేసే వారిని ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తన మాటను ధిక్కరించి… చెత్తను పంట కాలువలో పడేసే వారిపై రూ.1,000 జరిమానాను విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఇలా పోగయ్యే నిధులతో కెనాల్ డెవలప్ మెంట్ ఫండ్ పేరిట ఓ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధులతో పంట కాలువలను శుభ్రం చేయడానికి వినియోగిస్తామని ఆయన తెలిపారు. అయితే ఏ ఒక్కరు కూడా పంట కాలువల్లో చెత్తను వేసి ఈ జరిమానాను కట్టాలని తాను కోరుకోవడం లేదని…పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న భావనతోనే ఈ నిబంధన పెడుతున్నట్లు ఆయన సెలవిచ్చారు.