‘విశాఖ’ కూడా వైసీపీ చేజారిపోయింది!

ఏపీలో విపక్షం వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు దక్కడం, ఆ తర్వాత పార్టీలో కీలక నేతలంతా క్యూ కట్టి బయటకు వెళ్లిపోతుండటం… అప్పటిదాకా తమ పాలనలో ఉన్న స్థానిక సంస్థలన్నీ ఒక్కొక్కటిగానే చేజారుతుండటంతో అసలు వైసీపీకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇలాంటి నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ చేజారిపోయేందుకు రంగం సిద్ధమైంది. జీవీఎంసీ పాలక వర్గంలో వైసీపీకి పెద్దగా మెజారిటీ లేకున్నా…ఎలాగోలా నెట్టుకువస్తోంది. అయితే శనివారం జీవీఎంసీ మేయర్ పై కూటమి పక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి.

జీవీఎంసీకి 2021లో ఎన్నికలు జరగగా… మొత్తం 98 సీట్లకు నాడు అధికారంలో ఉన్న వైసీపీ 59 సీట్లను గెలిచింది. నగరంలో గట్టి పట్టున్న టీడీపీ 29 సీట్లకు పరిమతం కాగా… జనసేన 3 సీట్లు…బీజేపీ, సీపీఐ, సీపీఎంలు ఒక్కో సీటు, స్వతంత్రులు 4 సీట్లలో విజయం సాదించారు. వెరసి వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని దానిపై గొలగాని హరి వెంకట కుమారిని కూర్చోబెట్టింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడికక్కడ వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోతున్నారు. జీవీఎంసీ పరిదిలోనూ ఇదే జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీల బలం నాడు 33 సీట్లకే పరిమితం కాగా ఇప్పుడు ఆ బలం ఏకంగా 70కి చేరిపోయింది.

ఇంకేముంది…ఆ 70 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులతో కలిసి శనివారం జీవీఎంసీ ఇంచార్జీ కమిషనర్ గా ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్ ను కలిశారు. మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలనుకుంటున్నామని వారు ఓ అర్జీని ఆయనకు అందించారు. దానిపై 70 మంది కార్పొరేటర్ల సంతకాలు, ఎక్ష్ అఫీసియో సభ్యుల సంతకాలు పెట్టి మరీ అందించారు. ఈ వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. త్వరలోనే దానిని పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలు చేపడతామని తెలిపారు. జీవీఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 98 కాగా… 70 మంది అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే… దానిని తిరస్కరించే ఛాన్సే లేదు. అంటే… తీర్మానం ప్రవేశపెట్టడం, వైసీపీ నుంచి జీవీఎంసీ పగ్గాలు కూటమికి దక్కడం ఖాయమేనన్నమాట.