‘జంపింగ్’లపై మల్లారెడ్డి మాటలు విన్నారా?

చామకూర మల్లారెడ్డి… నిత్యం వార్తల్లో ఉండే రాజకీయ నాయకుడు. పూలమ్మాను, పాలమ్మాను అంటూనే విద్యావేత్తగా మారిపోయిన మల్లారెడ్డి… ఆ తర్వాత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మల్కాజిగిరి ఎంపీగా వచ్చీరాగానే సత్తా చాటిన మల్లారెడ్డి… ఆ తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏకంగా తెలంగాణ మంత్రిగానూ ఆయన పదవి దక్కించుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా మరోమారు గెలిచిన మల్లారెడ్డి… తాజాగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు నిజమేన్నట్లుగా శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డితో బేటీ అయ్యారు. ఈ భేటీపై ఊహాగానాలు మొదలు కాగానే.. వాటికి చెక్ పెట్టేవా మల్లారెడ్డి శనివారం తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.

72 ఏళ్ల వయసు వచ్చిందని.. ఈ వయసులో తానెందుకు పార్టీ మారతానని మల్లారెడ్డి ఓ లాజిక్ లెస్ వ్యాఖ్య చేశారు. పార్టీ మారాల్సిన అవసరం తనకేముందని అన్నారు. కవేలం ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల గురించి మాట్లాడేందుకే తాను సీఎంతో భేటీ అయ్యానని మల్లారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ లో తాను ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానని కూడా ఆయన అన్నారు. బీఆర్ఎస్ లో తమ కుటుంబం ఆశించిన మేర సీట్లు లబిస్తే… ఏకంగా పోటీ చేసేందుకు నలుగురు రెడీ గా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా జమిలి ఎన్నికలు గనుక వస్తే… తాను ఎంపీగా పోటీ చేస్తానని కూడా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తంగా బీఆర్ఎస్ ను వదలాల్సిన అవసరం తనకేమీ లేదన్న మల్లారెడ్డి… కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం కూడా తనకు లేదని తేల్చి పారేశారు.

సరిగ్గా రాష్ట్ర విభజన సమయంలోనే మల్లారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన సీమాంధ్రులు అత్యధికంగా ఉన్న మల్కాజిగిరీ పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మల్లారెడ్డి కూడా తన రూటును మార్చుకున్నారు. టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాదించారు. ఆ తర్వాత రెండంటే రెండు నెలల్లోనే ఆయన తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా మారిపోయారు. ఇక 2023లోనూ మేడ్చల్ నుంచే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన వరుసగా రెండుసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన విపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.