జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయోగాలు.. జనసేన నాయకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధారణంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి, పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ, పార్టీ కార్యక్రమాలు సహా.. ఇతర పదవుల విషయంలో తాను ఎంపిక చేసుకున్న వారికి పవన్ అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కేడర్ మాట ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో గత ఏడాది ఎన్నిక ల్లో పార్టీ విజయం కోసం కృషి చేసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుని పది మాసాలు అయినప్పటికీ.. పార్టీలో కీలక పదవులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ను పీఏసీ చైర్మన్ నుంచి తప్పించి.. మరో కీలక నేతకు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. ఆ మేరకు ప్రచారం కూడా జరిగింది. కానీ, అలా చేయలేదు. పైగా.. ఆయననే కొనసాగిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. అటు ప్రభుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ.. నాదెండ్ల చక్రం తిప్పుతున్నారు.
దీంతో ఈ పదవిని ఆశించిన కీలక నాయకులు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, బూత్ స్థాయిలో పార్టీని నిలబెట్టేందుకు.. ఎక్కడా ప్రయత్నాలు చేస్తున్న దాఖలా కూడా కనిపించడం లేదు. ఇది కూడా.. క్షేత్రస్థాయిలో జెండా మోస్తున్నవారిని నిరాశ కలిగిస్తున్న అంశం. అదేవిధంగా పార్టీని ప్రక్షాళన చేయాలని.. పదవులను కల్పించాలని కొన్నాళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై కూడా జనసేన అధినేత ప్రయత్నం చేయడం లేదు.
మరీ ముఖ్యంగా ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కేవలం 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లోనే పార్టీ మనుగడ కనిపిస్తోంది. కానీ, వచ్చే ఎన్నికల నాటిని నాయకులను పెంచుకునేందుకు నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకునేందుకు జనసేననానిప్రయత్నాలు సాగించకపోవడం గమనార్హం. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీలు మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీలను పుంజుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం, జనసేన తరఫున ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో సేనలు అల్లాడుతున్నాయి.