‘ముంతాజ్’కు మంగళం పాడేసిన చంద్రబాబు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరికి అత్యంత సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ అయిన వైనం చాలా కాలంగా హిందువులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. అప్పటికే తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతున్నా సరైన చర్యలు లేవంటూ ఆందోళన వ్యక్తం అవుతుంటే… శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ అవడం నిజంగా మరింతగా ఆందోళన రేకెత్తించేదే. ఇప్పుడు ఆ ఆందోళనలకు తెర దించుతూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కు మంగళం పాడేశారు. ఆ సంస్థకు మంజూరు చేసిన స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన తిరుమల వేదికగానే ప్రకటించారు.

తన మనవడు నారా దేవాన్ష్ జన్మదిన వేడుకల కోసం సకుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల చేరుకున్న చంద్రబాబు… అక్కడ పూజాధికాలు ముగించుకుని టీటీడీ వ్యవహారాలపై సమీక్షకు దిగారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా ఎప్పటికప్పుడు వివాదం రేపుతూనే ఉన్న ముంతాజ్ హోటల్ పైనా ఆయన దృష్టి సారించారు. ముంతాజ్ హోటల్ తో పాటుగా ఓ క్రిస్టియన్ మిషనరీ సంస్థ, మరో ప్రైవేట్ కన్ స్ట్రక్షన్ సంస్థకు కూడా భూములను కేటాయించిన విషయాన్ని తెలుసుకుని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంతాజ్ హోటల్ తో పాటుగా మిగిలిన రెండు సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు అక్కడికక్కడే ప్రకటించేశారు.

ఈ సందర్భంగా ముంతాజ్ హోటల్ యాజమాన్యం ఎలాగైనా అలిపిరి చెంత హోటల్ ను ఏర్పాటు చేసి తీరాలన్న దిశగా అడుగులు వేసిన విషయాన్ని కూడా చంద్రబాబు బయటపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముంతాజ్ హోటల్ భూములను రద్దు చేసేందుకు సిద్ధం కాగా… పేరు ముంతాజ్ అనే పేరును మారుస్తామంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని చంద్రబాబు తెలిపారు. అయినా సరే కుదరదని చెప్పగా…హోటల్ లో సాంతం వెజిటేరియన్ నే సర్వ్ చేస్తామని కూడా నమ్మబలికిందట. ఏడకొండల చెంత ఇతరుల…ప్రత్యేకించి ప్రైవేట్ వ్యక్తుల కార్యకలాపాలే వద్దంటే… మీరేమో అదొకటి, ఇదొకటి అని చెబుతారేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు కొండలకు అనుకుని కాకుండా… ఏడు కొండలను ఆనుకుని ఉన్నరోడ్డుకు అవతలి వైపున అయితే అనుమతులు ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రకటనతో అలిపిరి చెంత ముంతాజ్ కథ కంచికి చేరినట్టేనని చెప్పక తప్పదు.