దివంగత ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పినా.. వేనేళ్ల పొగిడినా తక్కువే. ఆయన నటనకు మరింత అద్దం పట్టిన పాత్ర `దానవీరశూరకర్ణ` సినిమాలోని దుర్యోధనుడి పాత్ర. దీనిలో `ఏమంటివేమంటివి..` అంటూ సాగే.. డైలాగ్(దీనిని తిరుపతి వెంకటకవులు రాశారని అంటారు) ఎంతో ఫేమస్. సినిమా మొత్తం ఒక ఎత్తయితే.. అన్నగారి నోటి నుంచి గంగా ప్రవాహం మాదిరిగా దూసుకు వచ్చిన ఈ ఒక్క డైలాగ్ మరో ఎత్తు. ఆ డైలాగు.. చాలా కాలం పాటు సామాన్యుల నోట నానుడిగా మారిపోయింది.
తాజాగా ఇదే డైలాగుతో అదరగొట్టారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అచ్చం అలనాటి అన్నగారి వేష ధారణలో స్టేజ్పై ఆయన పలికించిన ఈ డైలాగు భావయుక్తంగా.. వినసొంపుగా అందరి నీ ఆకట్టుకుంది. పాండవపక్షానికి-కౌరవ పక్షానికీ మధ్య విలు విద్య, ఇతర విద్యల్లో పోటీ జరిగినప్పుడు.. సూత సుతడైన కర్ణుడు.. అర్జునుడితో విలు విద్య పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు ఇరు పక్షాలకు ఆచార్యుడైన ద్రోణుడు.. కర్ణుడిని అవమానించి.. ఆయన కులాన్ని ప్రస్తావిస్తాడు.
`కుల హీనుడు ఈ పరీక్షలో పాల్గొనేందుకు అర్హుడు కాద`ని తేలుస్తాడు ద్రోణుడు. ఈ సమయంలో దుర్యోధ నుడు తీవ్ర ఆగ్రహంతో తమ జాతి మొత్తం ఎలా సంకరమైందో వివరించే ఈ డైలాగు.. దాన వీర శూరకర్ణ సినిమాలో అత్యంత కీలకమైన స్థానం పొందింది. దీనిని ఆర్ ఆర్ ఆర్.. తాజాగారక్తి కట్టించారు. విజయవాడలోని ఎన్ కన్వెన్షన్లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జరిగిన సాంస్కృతిక పోటీల్లో ఆర్ ఆర్ ఆర్ దుర్యోధనుడిగా ఏకపాత్రాభినయం చేశారు.
ఆయన డైలాగులకు ముగ్ధులైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇతర సభ్యులు, స్పీకర్ అయ్యన్న చప్పట్లతో హోరెత్తించారు. తమ తమ సీట్లలో నుంచి పైకిలేచి నిలబడి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆర్ ఆర్ ఆర్లో పొలిటికల్ ఫైర్తో పాటు.. కళా పోషణ కూడా ఉందని ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంలు వ్యాఖ్యానించడం విశేషం.