బాబుతో పవన్ భేటీ!… ఈ సారి అజెండా ఏమిటో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగగా… దానికి హాజరైన పవన్… కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత… చంద్రబాబుతో విడిగా భేటీ అయ్యారు. వీరిద్దరు మాత్రమే ప్రత్యేకంగా భేటీ అయిన తీరుపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుందామని ఇదివరకే చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబుతో పవన్ భేటీ కావడంతో దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకేననే చర్చ జరుగుతోంది.

గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా… చంద్రబాబు, పవన్ లు సభ బయటకు వచ్చి అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఆఫీస్ లో భేటీ అయిన సంగతి తెలిసిందే. నాడు నాగబాబుకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే విషయంపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్బంగా పవన్ ప్రతిపాదనను తిరస్కరించిన చంద్రబాబు… నాగబాబును రాజ్యసభకు కాకుండా శాసన మండలికి పంపిద్దామని… ఆ తర్వాత ఆయనను నేరుగా కేబినెట్ లోకి తీసుకుందామని ప్రతిపాదించారు. బాబు ప్రతిపాదన నచ్చడంతో పవన్ అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. ఆ తర్వాత బాబు చెప్పినట్లుగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు అవకాశం కల్పించారు. నాగబాబు ఏకగ్రీవంగా మండలికి ఎన్నిక కూడా అయ్యారు.

మరి బాబు చెప్పిన ప్రకారం నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాల్సి ఉంది కదా. అదే సమయంలో కేబినెట్ లో ఖాళీలు, పునర్వ్యస్థీకరణ వంటి అంశాలపై ఇప్పుడు జోరుగానే చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో కేబినెట్ భేటీ ముగియగానే.. బాబుతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవడంతో పాటుగా ఆయనకు ఏ శాఖ కేటాయించాలి?.. మంత్రిమండలిలో మార్పులుచేర్పులపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల గురించి కూడా బాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.