మా నాన్నకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం లభిస్తుంది?
అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ మర్రెడ్డి సునీత ఆవేదనగా ప్రశ్నించారు. నేడు (మార్చి 15) వివేకానందరెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకుని వివేకా సమాధి వద్ద ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించా రు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత.. తన తండ్రి కేసులో బాధ్యులు ఎవరో.. ఎక్కడున్నారో అందరికీ తెలిసినా.. వారికి మాత్రం ఏమీ కావడం లేదన్నారు.
“మా నాన్న హత్యకు గురై.. నష్టపోయింది మేం. ఇప్పుడు కూడా కేసు ముందుకు సాగకపోవడంతో నష్టపోతోంది కూడా మేమే. పైగా బాధితులమైన మమ్మల్ని నిందితులుగా చూపిస్తున్నారు” అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్యపై ఎంత పోరాటం చేసినా.. తమకు న్యాయం లభించడం లేదన్నారు. నిందితులు తప్పించుకుంటున్నారా? అనేది కూడా ప్రశ్నగా మారిందన్నారు. వరుసగా సాక్షులు చనిపోతున్నారని.. దీనివెనుక ఏం జరుగుతోందో కూడా అర్ధం కావడం లేదన్నారు.
రాష్ట్రప్రభుత్వం తమ కుటుంబానికి అండగా నిలవాలని సునీత వేడుకున్నారు. అయితే.. తమ తండ్రి తరఫున న్యాయం కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని సునీత తెలిపారు. సీబీఐ మళ్లీ ఈ కేసును జీరో లెవిల్ నుంచి విచారణ జరిపించాలని తాను కోరుతున్నట్టు తెలిపారు. “హత్యకు పురిగొల్పిన వారు కళ్ల ముందే కనిపిస్తున్నారు. అయినా మాకు న్యాయం జరగడం లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు” అని సునీత వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
2019, మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. సీబీఐ విచారణ జరిగినా.. కూడా ఈ కేసులో నిందితులు ఎవరు అనేది ఇప్పటి వరకు తేలకపోవడం గమనార్హం. అంతేకాదు.. అప్రూవర్గా మారిన దస్తగిరికి సైతం బెదిరింపులు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. మరి ఎప్పటికి తేలుతుందనేది ప్రశ్నగామారింది.