ఏయూ మాజీ వీసీ ప్రసాద రెడ్డిపై లోకేశ్ ఫైర్

వైసీపీ హయాంలో రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారిని యూనివర్సిటీలకు వీసీలుగా నియమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖలోని ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీని మాజీ వీసీ ప్రసాద రెడ్డి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఆఫీసుగా మార్చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీకి అనుకూలంగా ప్రసాదరెడ్డి ప్రచారం చేశారని, ఈ వ్యవహారంపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని, విజిలెన్స్ అకౌంట్ వేశామని అన్నారు. కమిటీ విచారణ జరిపి 60 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఇంకోసారి పొరపాటు చేయాలంటే భయపడేవిధంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను పెంచి యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు.

ఆంధ్రా యూనివర్సిటీ ఒక సెంటిమెంటుతో కూడుకున్నదని, బ్యాంక్ ఆఫ్ అమెరికా చైర్మన్, జీఎమ్మార్ అధినేత ఏయూలో చదువుకున్న వారేనని గుర్తు చేశారు. ప్రపంచంలోని టాప్ 100లో ఏయూ ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారని, అందుకే ఐఐటి కరఖ్ పూర్ ప్రోఫెసర్‌ రాజశేఖర్‌ను ఏయూ వీసీగా నియమించారని చెప్పారు.

గత వీసీ ప్రసాద రెడ్డి జగన్ కు అనుకూలంగా పనిచేశారని, జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్‌ను దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఫండ్స్ డైవర్సన్, అక్రమ నియామకాలతో ఏయూను రాజకీయ కార్యాలయంగా ప్రసాదరెడ్డి మార్చారని ఆరోపించారు. సెనేట్ హలులో రాజకీయ నాయకుల పుట్టిన రోజు పార్టీలు చేశారని, ఇష్టానుసారం అపాయింట్మెంట్ ఇచ్చారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో దసపల్లా హోటల్‌లో మీటింగ్ పెట్టారని, దానిపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి క్రిమినల్స్ విషయంలో ఉదాసీనంగా ఉండడం తగదని అన్నారు.

ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీని ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చాడని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో డబ్బు సంచులు మొదలుకొని అన్ని ఏయూలోనే జరిగాయని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆరోపించారు.