బాబుతో వీర్రాజు ప్యాచప్ అయినట్టే!

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా… పోటీకి దూరంగా ఉండిపోయిన జనసేన.. ఆ రెండు పార్టీల కూటమికి మద్దతుగా నిలిచింది. వెరసి టీడీపీ, బీజేపీ విజయం సాధించాయి. రెండు పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ క్రమంలోనే బీజేపీకి చెందిన సీనియర్ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. నాడు చంద్రబాబు విధానాలను విమర్శిస్తూ సాగిన వీర్రాజు… తాజాగా ఇప్పుడు మరోమారు టీడీపీ సభ్యుల మద్దతుతోనే మరోమారు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి 5 స్థానాలు దక్కగా.. వాటిలో ఓ స్థానం బీజేపీకి దక్కగా… ఆ స్థానం నుంచి వీర్రాజే నామినేషన వేశారు. అనంతరం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరి ఈ సారి అయినా చంద్రబాబుతో వీర్రాజు కలిసి సాగుతారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.

2014లో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగానే ఉన్నా గానీ ఎందుకనో గానీ… వీర్రాజు నిత్యం బాబు విధానాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించేవారు. బీజేపీ నేతలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపణలు గుప్పించేవారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించేవారు. ఫలితంగా స్వపక్షంలోనే చంద్రబాబుకు ఆయన ఓ విపక్షంలా మారిపోయారన్న వాదనలు వినిపించాయి. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన సమయంలో వీర్రాజు మరింతగా తన నోటికి పని చెప్పారు. తానేదో వైసీపీ సభ్యుడినన్నట్లుగా వీర్రాజు వ్యవహరించేవారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు గానీ, రాష్ట్రానికి గానీ పెద్దగా ఒరిగిందేమీ లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసేవారు.

నాటి విషయాలన్నింటినీ చంద్రబాబు అయితే పక్కనపెట్టేశారనే చెప్పాలి. పొత్తు ధర్మంలో భాగంగా తనకు దక్కిన 5 ఎమ్మెల్సీల్లో ఓ స్థానాన్ని బీజేపీకి, మరో సీటును బీజేపీకి ఆయన కేటాయించారు. బీజేపీ తన సీటును వీర్రాజుకు కేటాయించింది. ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే అన్న తర్వాతే బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వచ్చిందని చెప్పక తప్పదు. గతంలో తన విధానాలనే విమర్శిస్తూ సాగిన వీర్రాజు అభ్యర్థిత్వాన్ని కాదనకుండా చంద్రబాబు పరిణతితో సాగారు. మరి అదే పరిణతి, పొత్తు ధర్మాన్ని వీర్రాజు పాటిస్తారా? లేదా? అన్నది చూడాలి. నామినేషన్ తర్వాత తనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన బీజేపీ పెద్దలతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కూడా వీర్రాజు థ్యాంక్స్ చెప్పారు. అంతటితో ఆగకుండా పురంధేశ్వరి వెంట రాగా… ఆయన చంద్రబాబును నేరుగా వెళ్లి కలిశారు. ఇదంతా చూస్తుంటే… చంద్రబాబు మాదిరే వీర్రాజు కూడా గతాన్ని గుర్తు చేయకుండా సాగుతారన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.