తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో లెక్కలేనన్ని సంచలనాలు నమోదు అవుతున్నాయి. 2023 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఫలితంగా అప్పటిదాకా దఫదఫాలుగా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన వారిలో ఓ 10 మంది దాకా కాంగ్రెస్ గూటికి చేరారు. అలా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన మరో కీలక నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇప్పుడు హస్తం పార్టీ వైపు చూస్తున్నారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సోమవారం మొదలయ్యాయి. ఇందుకు కౌశిక్ రెడ్డి వ్యవహార సరళే కారణంగా నిలిచింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు చివరి రోజు సోమవారమే. ఈ నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ, విపక్షం బీఆర్ఎస్ లకు చెందిన ఐదుగురు అభ్యర్థులు సోమవారమే అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయా పార్టీల తరఫున కీలక నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్ నిమిత్తం అసెంబ్లీకి వచ్చిన కౌశిక్ రెడ్డి… ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయం (సీఎల్పీ)లోకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన శంకర్ నాయక్ ను ఆయన కలిశారు. నాయక్ కు కౌశిక్ రెడ్డి అభినందనలు కూడా తెలిపారు.
సీఎల్పీ కార్యాలయంలో కౌశిక్ రెడ్దిని చూసినంతనే… అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే… ఇప్పుడు అధికార కాంగ్రెస్ పై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతల్లో కౌశిక్ రెడ్డిది తొలి స్థానమనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రతి చర్యను విమర్శిస్తూ సాగుతున్న కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. కౌశిక్ ను పోలీసులు పలుమార్లు అరెస్టు కూడా చేశారు. ఇక బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్ రెడ్డి ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తంగా కాంగ్రెస్ అంటేనే అంతెత్తున లేస్తున్న కౌశిక్ రెడ్డి… ఉన్నట్టుండి ఆ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడం చూస్తే… ఎవరికైనా అనుమానాలు వస్తాయి కదా.
పాడి కౌశిక్ రెడ్డి ఆదిలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నాడు పీసీసీ ఛీప్ గా, నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. అప్పుడెప్పుడో ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన సమయంలో హుజూరాబాద్ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహం రచించిన రేవంత్… కాంగ్రెస్ అభ్యర్థిగా కౌశిక్ నే ఎంపిక చేశారు. ఒకటి, రెండు రోజులు ఆగి ఉంటే.. కౌశిక్ కాంగ్రెస్ బీ ఫామ్ కూడా దక్కి ఉండేదే. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కౌశిక్ నెరపుతున్న రహస్య మంతనాలు బయటపడటంతో కౌశిక్ పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది. ఈ తరహా పరిణామాలకు ముందే సిద్ధమైపోయిన కౌశిక్… సస్పెన్షన్ కంటే ముందే బీఆర్ఎస్ లోకి చేరిపోయారు. ఈ లెక్కన కాంగ్రెస్ లో ఆయనకు ఇప్పటికే మిత్రులు ఉంటే ఉంటారు. రేవంత్ కు సన్నిహితంగా మెలగిన కౌశిక్ తన తప్పును ఒప్పుకుని కాంగ్రెస్ లో చేరతానంటే రేవంత్ కూడా అడ్డు చెప్పకపోవచ్చన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.