డ్రాగన్ దూకుడుకు భారత్ ‘బెకా’ తో చెక్ పెట్టగలదా ?

సరిహద్దుల్లో ప్రతిరోజు ఉద్రిక్తతలను సృష్టిస్తున్న డ్రాగన్ దేశం చర్యలకు చెక్ పెట్టడానికి మనదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లోనే కాకుండా రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక రంగంలో అసవరమైన అన్నీ ఒప్పందాలను అగ్రరాజ్యం అమెరికాతో చేసుకుంటోంది. ఈ ఒప్పందాల వల్ల సరిహద్దుల్లో ఇటు చైనా అటు పాకిస్ధాన్ దేశాల సైన్యాల కదలికలను ఎప్పటికప్పుడు తెలిసిపోయే అవకాశాలున్నాయి. శాటిలైట్ ద్వారా వీడియోలు, ఫొటోలు, మ్యాపులు చివరకు సైన్యాల కదలికలను కూడా మనం తెలుసుకునే వీలుందట.

ఢిల్లీలో భారత్-అమెరికా రక్షణ మంత్రుల మధ్య బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) జరగనుంది. ఒప్పందం జిరిగిన వెంటనే అందులోని అంశాలు అమల్లోకి వచ్చేస్తాయి. దీనివల్ల భౌగోళిక, అంతరిక్ష సమాచరాన్ని మనదేశం సైన్యం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు చైనా, పాకిస్ధాన్ దేశాలు మన కళ్ళుకప్పి కొందరిని సరిహద్దుల్లో నుండి మన భూభాగంలోకి పంపిస్తున్నాయి. వీరిలో సైనికులున్నారు, టెర్రరిస్టులు కూడా ఉన్నారు. ఇలా చొరబడే వాళ్ళని అడ్డగించటం నిజానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పై దేశాలతో మనకు వేలాది కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉండటమే కారణం.

అయితే అమెరికాతో తాజాగా జరిగబోయే రక్షణ ఒప్పందాల వల్ల సరిహద్దులు ఎన్ని వేల కిలోమీటర్లున్నా సరే రియల్ టైంలో ఎక్కడ ఏ చిన్న కదలికలు కనిపించినా వెంటనే శాటిలైట్లు వీడియోలు, ఫొటులు మ్యాపులతో సహా మనకు అందిచేస్తాయి. సూక్ష్మంగా చెప్పాలంటే క్రికెట్ ఆడుతున్నపుడు లైవ్ మ్యాచ్ ను జనాలు ఎలా చూడగలరో అదే పద్దతిలో సరిహద్దులను మన సైన్యం అలాగే చూడగలదు. ఏ ప్రాంతంలో అవసరమైతే ఆ ప్రాంతాన్ని లైవ్ రిలేలో చూడగలదు. అదే సమయంలో అనుమానాస్పద కదలికలను శాటిలైట్లు ఎలాగూ వీడియో, ఫొటోల రూపంలో కూడా 24 గంటలు, 365 రోజులు పంపుతునే ఉంటాయి.

హిమాలయ పర్వతాల్లో శతృదేశాల కదిలకలను మనకు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఇప్పటివరకు లేదు. ఎవరైనా సమాచారం ఇస్తేనో లేకపోతే మన సైన్యానికి అనుమానం వచ్చి తనిఖీలు చేసినపుడో అక్కడేదైనా ఘటనలు జరిగితేనే బయటపడుతున్నాయి. తూర్పు లడ్డాఖ్ లాంటి 14 వేల అడుగుల ఎత్తున్న పర్వత ప్రాంతాల్లో జరిగే డెవలప్మెంట్లు తెలుసుకునే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇటువంటి పరిస్ధితులను పాకిస్ధాన్, చైనాలు బాగా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి ఇంత వరకు.

అయితే తాజాగా జరిగే రక్షణ ఒప్పందాలు అమల్లోకి వచ్చిన దగ్గర నుండి శతృదేశాల ఆటలు సాగవు. ఇప్పటి వరకు అమెరికా ఇతర దేశాలపై చేస్తున్న దాడులు, టార్గెట్ ను ఛేదించటంలో కచ్చితత్వానికి బెకా టెక్నాలజీనే ప్రధాన కారణం. ఇంతటి ప్రాధాన్యమున్నటెక్నాలజీ షేరింగ్ ఒప్పందాన్ని అమెరికా మనతో చేసుకుంటోంది. కాబట్టి టెక్నాలజీని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే సరిహద్దుల్లో జరిగే కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం ద్వారా ముదు జాగ్రత్త పడే అవకాశాలున్నాయి.