వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని తీరుపై ఇటీవలి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం కేంద్రంగా రాజకీయం చేస్తున్న నాని… వైసీపీ వాదనలను బలంగా వినిపించే నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా ఈగ వాలిందంటే చాలు వెంటనే ప్రతిస్పందించే నాని… గత కొంతకాలంగా అసలు మీడియా ముందుకే రావడం లేదు. తనపై రేషన్ బియ్యం కేసు నమోదు అయినంతనే వైసీపీ కార్యాలయానికే రావడం మానేశారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో ఆయన ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లినంత పనిచేశారు. ఆ తర్వాత బయటకు వచ్చినా.. వైసీపీ ఆఫీస్ చుట్టుపక్కలకే ఆయన రాలేదు. అయితే మొన్న హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వగానే… మరునాడే వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరిగి తన పాత వాగ్దాటితో ప్రత్యక్షమయ్యారు.
చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్న పేర్ని దాదాపుగా అన్ని అంశాలపై సమగ్ర పట్టు కలిగి ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా స్పాంటేనిటీలోనూ దిట్టగా ఆయనకు పేరుంది. ప్రాసలు, యాసలతో ఎదురు దాడి చేయగల సమర్థతా ఆయన సొంతం. అసభ్య పదజాలం వినియోగించకుండా విమర్శలు గుప్పించడంలో నాని నేర్పరి. ఇన్నేసి ప్రత్యేకతలు కలిగిన నానికి వైసీపీలో మంచి గుర్తింపే దక్కింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే.. నానికి జగన్ కేబినెట్లో స్థానమూ దక్కింది. కీలక శాఖల బాధ్యతలూ ఆయనకు దక్కాయి. జగన్ ఇచ్చిన బాధ్యతలను నాని కూడా సమర్థవంతంగానే నిర్వర్తించారు. తన సత్తాను ఇంకా ఇనుమడింపజేసుకున్నారు. పదవులపై తనకు పెద్దగా మక్కువేమీ లేదని కూడా నిరూపించుకున్నారు. ఇక మంత్రిగా ఉన్న సమయంలో తన సతీమణి పేరిట బందరులో ఓ భారీ గోదామును నిర్మించిన నాని.. దానిని సివిల్ సప్లైస్ కు అద్దెకు ఇచ్చారు. అదే నానిని ఇరుకున పడేసింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి…కూటమి రికార్డు మెజారిటీతో అధికారంలోకి రావడంతో నాని గోదాములో బియ్యం మాయం ఘటన వెలుగు చూసింది. వెంటనే స్పందించిన నాని.. మాయం అయిన బియ్యం ఖరీదెంత అంటూ ఆరా తీసి సొమ్మును జమ చేశారు. పేదల బియ్యాన్ని మాయం చేసి….అది బయట పడ్డాక డబ్బు కడతామంటే.. అంతటితోనే కుదరదు కదా. ఈ బియ్యం మాయం వెలుగులోకి వచ్చింది కాబట్టి డబ్బు కట్టారు…ఒకవేళ అది వెలుగులోకి రాకుంటే పరిస్థితి ఏంటి? ఇదే తీరున సాగిన సర్కారు నాని సహా నాని సతీమణి, వారి వద్ద పనిచేస్తున్న వ్యక్తుల మీద కేసులు నమోదు చేసింది. కేసులు నమోదు అయిన వెంటనే నాని ఫ్యామిలీతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఓ వైపున తన మనుషుల ద్వారా కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయిస్తూ.. తన సతీమణికి బెయిల్ వచ్చేదాకా ఆయన బయటకే రాలేదు.ఆ తర్వాత బయటకు వచ్చినా… వైసీపీ ఆఫీస్ వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. ఏదో ఎక్కడో తనను కలిసిన మీడియా ముందు మాట్లాడటం తప్పించి… ఓ స్పెషిఫిక్ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టిందే లేదు.
ఇక చాలా కాలంగా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన నాని.. కోర్టు తీర్పు కోసం వేచి చూశారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ ఆఫీసు గేటును కూడా ముట్టుకోలేదనే చెప్పాలి. తాజాగా శుక్రవారం నానికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతే.. విరిగిపోయిన రెక్కలు మళ్లీ వచ్చినట్టుగా నాని ఫీలయినట్లున్నారు. ముందస్తు బెయిల్ ఇలా రావడం.. ఆ మరునాడే వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన వాలిపోవడం జరిగిపోయింది. ఏకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ కూటమి సర్కారు తీరుపై ఆయన తనదైన శైలి విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ భేటీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన సాక్షి రంగన్న మృతిపై చర్చ జరిగిందన్న విషయాన్ని కేంద్రంగా చేసుకుని… రాష్ట్రంలో ఇంతకంటే కీలకమైన అంశాలు లేవా? అంటూ ఆయన చెలరేగిపోయారు. ఇలా కేసు నమోదు కాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, బెయిల్ రాగానే తిరిగి యాక్టివేట్ అయిన నాని తీరుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.