జానా రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి… మ్యాటరేంటి?

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ లో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… గురువారం మధ్యాహ్నం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి ఇంటికి వెళ్లారు. దాదాపుగా గంటకు పైగా ఆయన జానా రెడ్డి ఇంటిలోనే గడిపారు. జానా రెడ్డితో సుదీర్ఘంగా… కాస్తంత సీరియస్ గానే చర్చలు జరిపారు. ఆ తర్వాత జానా రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి… నేరుగా సచివాలయం వెళ్లారు. కేబినెట్ భేటీలో మునిగిపోయారు. గతంలోనూ… పీసీసీ చీఫ్ పదవి దక్కిన తర్వాత కూడా జానా రెడ్డిని రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కలిశారు కదా అంటారా? అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు కదా.

నాడు పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు చేతికి అందిన నేపథ్యంలో పార్టీలో సీనియర్ల సహకారం లేకుండా తాను ముందుకు సాగలేనన్న వాస్తవాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి… జానా రెడ్డితో పాటు చాలా మంది పార్టీ సీనియర్ నేతలను కలిశారు. వారితో కలిసి నడుస్తానని, వారంతా తనతో కలిసి నడవాలని కోరారు. వారి సలహాల మేరకే నడుచుకుంటానని చెప్పారు. ఈ తీరుగానే సాగిన రేవంత్ రెడ్డి అందరి సహకారంతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ కు పార్టీ అధిష్ఠానం కూడా గుర్తింపు ఇచ్చింది. సీఎం పదవిని ఇచ్చి గౌరవించింది. సీఎంగా ఇప్పటికే ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న రేవంత్… పూర్తి స్థాయి సీఎంగా సాగే దిశగా కదులుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి… మరోమారు నేరుగా జానా రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ ఈ తరహాలో జానా వద్దకు వెళ్లిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా పార్టీలోని నేతలను 3 వర్గాలుగా విభజించిన మీనాక్షి… ఎవరికి ఏ తీరున ప్రాధాన్యం ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసినట్టుగానే చెబుతున్నారు. ఈ క్లారిటీ మేరకే రేవంత్.. జానా వద్దకు వెళ్లినట్లుగా సమాచారం. పార్టీలో సీనియర్ గా… సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా పనిచేసినందున పాలనలోనూ జానాకు మంచి అనుభవమే ఉంది. దానిని ఎందుకు వాడుకోకూడదన్న భావనతోనే రేవంత్ ఆయన ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం.

అంటే.. అతి త్వరలోనే జానాకు రేవంత్ సర్కారులో ఓ కీలక పదవి అయితే ఖాయమనే చెప్పాలి. మరి ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తరా?.. లేదంటే ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఇచ్చి… నేరుగా మంత్రివర్గంలోకే తీసుకుంటారా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. అంతేకాకుండా శుక్రవారం రేవంత్ ఢిల్లీ వెళుతున్నారు. హస్తినలో ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ పర్యటనకు ముందు రేవంత్.. జానా ఇంటికి వెళ్లి ఆయనతో చర్చల్లో మునిగిపోవడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏదైనా… రేవంత్ టూర్ తో జానాకు అయితే పూర్వ వైభవం తప్పనిసరి అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.