వారందరికీ చంద్రబాబు ఫోన్లు !

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు అలిగారని సమాచారం. కారణమేంటా అంటే… ఈమధ్యనే చంద్రబాబునాయుడు జాతీయ కమిటి, పాలిట్ బ్యూరో నియమించిన విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ కేడర్ డీలా పడింది. పార్టీలో జోష్ నింపే వ్యూహాల్లో భాగంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో ఒకటి కమిటీల నియామకం. అయితే… అటు కమిటిలోను, ఇటు పాలిట్ బ్యూరోలోను చోటు దక్కని చాలామంది సీనియర్లు చంద్రబాబుపై అలిగారట. నేరుగా ఎక్కడా తాము అసంతృప్తిని బయటకు వ్యక్తం చేయకుండా తన మద్దతుదారుల ద్వారా బయటపెడుతున్నారట.

ఉన్న ముగ్గురు ఎంపిల్లో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుకు పదవులు ఇచ్చిన చంద్రబాబు విజయవాడ ఎంపి కేశినేని నానిని పక్కనపెట్టేశారు. అలాగే గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నన్నపనేని రాజకుమారిలకు చోటు కల్పించలేదు. ఇక కృష్ణా జిల్లాలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనూరాధ లాంటి సీనియర్లకు ఏ కమిటిలోను చోటు కనబడలేదు.

ఇదే సందర్భంగా విశాఖనగరంలో మాజీమంత్రి గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళకు కూడా స్ధానం కల్పించలేదు. ప్రకాశం జిల్లాలోని ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు లాంటి వాళ్ళకు కూడా కమిటిల్లో చోటు దక్కలేదు. గంటా పార్టీని వదిలేస్తాడనే ప్రచారం కారణంగా చోటు కల్పించలేదని అనుకోవచ్చు. కానీ పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న గౌతు శిరీష లాంటి వాళ్ళకు కూడా చోటు ఎందుకు దక్కలేదో తెలీదు.

ఇదే విషయమై అనేకమంది సీనియర్ నేతలు పార్టీ అధినేతపై అసంతృప్తితో మండిపోతున్నారట. అయితే ఈ విషయం గ్రహించిన చంద్రబాబు అసంతృప్తితో ఉన్న నేతలకు నేరుగా ఫోన్లు చేసి మరీ బుజ్జగిస్తున్నారు. జాతీయ కమిటిలో కానీ పాలిట్ బ్యూరో లో కానీ చోటు కల్పించలేకపోయిన కారణాలను వివరించి చెబుతున్నారట. రాష్ట్ర కమిటిలో తప్పక స్ధానం కల్పిస్తానని హామీ ఇస్తున్నారట. నిజంగా ఆలోచిస్తే పార్టీ నేతల్లో ఎంతమందికని చంద్రబాబు మాత్రం చోటు కల్పించగలుగుతారు ? సీనియర్లందరికీ కమిటిల్లో చోటు కల్పించాలంటే ప్రతి కమిటిలోను వందలమందిని నియమించాల్సుంటుంది. మరి చంద్రబాబు బుజ్జగింపులు ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.