తెలంగాణ రైజింగ్‌ను ఎవ‌రూ ఆప‌లేరు: రేవంత్‌

తెలంగాణ అభివృద్ధిని ఎవ‌రూ ఆప‌లేర‌ని, 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీగా రాష్ట్రాన్ని మారుస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో త‌న వ్యూహాలు త‌న‌కు ఉన్నాయ‌ని చెప్పారు. తాజాగా హెచ్ సీఎల్ కొత్త క్యాంప‌స్ ప్రారంభోత్స‌వంలో సీఎం రేవంత్ తెలిపారు. “గ‌తంలో రాష్ట్రాన్ని1ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీగా మారుస్తాన‌ని చెప్పిన‌ప్పుడు.. కొందరు ఎద్దేవా చేశారు. కాయ‌లున్న చెట్టుకే రాళ్లు ప‌డ‌తాయ‌ని అన్న‌ట్టుగా.. ప‌నిచేసే ప్ర‌భుత్వంపైనే విమ‌ర్శ‌లు వ‌స్తాయి. అయినా.. మేం ప‌నిచేసుకుంటూ పోతున్నాం. ఖ‌చ్చితంగా 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీ సాధిస్తాం” అని స్ప‌ష్టం చేశారు.

గ‌తానికి మించి..

గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వానికి మించి తాము పెట్టుబ‌డులు తెచ్చామ‌ని సీఎం రేవంత్ తెలిపారు. తాము అధికారంలోకి వ‌చ్చిన 15 మాసాల్లోనే రెండుసార్లు దావోస్‌లో పెట్టుబ‌డుల స‌ద‌స్సు జ‌రిగింద‌ని.. రెండు సార్లు కూడా భారీ ఎత్తున పెట్టుబడుల‌ను తీసుకువ‌చ్చామ‌ని వివ‌రించారు. ఒక‌సారి 41వేల కోట్లు, రెండో సారి.. ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సులో 1.78 ల‌క్ష‌ల కోట్లు సాధించామ‌న్నారు. ఇవ‌న్నీ త్వ‌ర‌లోనే సాకారం అవుతాయ‌ని తెలిపారు. త‌ద్వారా.. 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీ సాకారం అవుతుంద‌ని చెప్పారు.

క‌నీవినీ ఎరుగ‌ని..

రాష్ట్రంలో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు సీఎం చెప్పారు. గ‌తంలో ప‌ది మందికి ఉద్యోగం ఇవ్వాలంటేనే ఏళ్లు ప‌ట్టేద‌ని.. బీఆర్ఎస్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, తాము వ‌చ్చాక 55 వేల మందికి 15 నెల‌ల స్వ‌ల్ప‌కాలంలోనే ఉద్యోగాలు ఇచ్చి.. దేశానికే ఆద‌ర్శంగా నిలిచామ‌న్నారు. “తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి న‌గ‌రాల‌తో కాదు.. ప్ర‌పంచ దేశాల‌తోనే” అని రేవంత్ ఉద్ఘాటించారు.

విద్యుత్ వాహ‌నాల త‌యారీ, ఉత్ప‌త్తిలో హైద‌రాబాద్‌ను నెంబ‌ర్ 1 చేసినట్ట తెలిపారు. దీంతో హ‌రిత ఇంధ‌నం, బ‌యో సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్‌ను ఇటీవలే ప్రారంభించిన విష‌యాన్ని సీఎం రేవంత్ ప్ర‌స్తావించారు.