వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకోవడం ఖాయమేనా? అన్నదిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ సెలబ్రిటీని అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులు అన్ని అంశాలను పక్కాగా ఉన్నాయో, లేవో చూసుకుని మరీ ముందుకు సాగాల్సి ఉంది. అయితే ఏమరపాటుగా జరిగిందో… లేదంటే కావాలనే అలా చేశారో తెలియదు గానీ.. పోసాని అరెస్టు సందర్భంగా పోలీసులు ఓ తప్పు చేశారు. అది ఇప్పుడు వారి మెడకు చుట్టుకోవడం ఖాయమేనని నిపుణులు చెబుతున్నారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు విపక్షంలో ఉండగా… వైసీపీ నేత హోదాలో పోసాని వారిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించిన పోసాని.. ఏపీలో వరుసబెట్టి జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో…గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాల జోలికి వెళ్లను మహాప్రభో.. తనను వదిలేయాలంటూ వేడుకున్నారు. అయితే గతంలో ఆయన బాబు, లోకేశ్, పవన్ లపై చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని పలు ప్రాంతాల్లో నమోదు అయిన కేసులను తీసుకుని బుధవారం హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పోసానిని అరెస్టు చేస్తున్నట్లుగా సీఐడీ అదికారులు పోసాని సతీమణికి నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల్లో తేదీని పోలీసులు తప్పుగా పేర్కొన్నారు. బుధవారం తేదీ 26 2 2025 కాగా… దానికి బదులుగా 27 2 2025 అని డేట్ వేసి ఇచ్చారు. హడావిడిలో పోసాని గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ దానిని చూసుకోలేదు. పోలీసులు అదుపులోకి తీసుకోగానే… పోసాని కూడా పోలీస్ జీపు ఎక్కేశారు. ఆ తర్వాత పోలీసులు ఇచ్చిన నోటీసును పోసాని కుటుంబ సభ్యులు ఒకింత పరిశీలించి చూడగా… అందులో డేట్ తప్పుగా ఉంది. దీనిని వారు తమకు తెలిసిన వారి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఇచ్చిన కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా కాపీని పట్టుకున్న వైసీపీ నేతలు… పోలీసులు కావాలనే ఇలా తర్వాతి రోజు డేట్ వేసి… దానికి ముందు రోజే పోసానిని అరెస్ట్ చేశారని, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందంటూ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామంపై కోర్టుల్లోనూ పోసాని వర్గం ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. దీంతో పోలీసులకు చిక్కులు తప్పేలా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.