ఆ ఇద్దరు… ఎవరు ఎవరికీ తగ్గట్లేదు

ఇటు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి… అటు రాజకీయ నేతగా మారిన సినీ నటి మాధవీ లత… ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా సాగుతున్నారు. ఓ చిన్న వివాదం వీరిద్దరి మధ్య రచ్చకు కారణంగా నిలవగా.. ఆ రచ్చ దాదాపుగా రెండు నెలల తరబడి కొనసాగుతుండటం గమనార్హం. ఓ వైపేమో వీరిద్దరి పార్టీలు మిత్రపక్షాలుగా సాగుతున్నా.. వీరిద్దరు మాత్రం బద్ధ శత్రువుల మాదిరిగా కీచులాడుకుంటున్నారు. వెరసి వీరి వివాదం ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో రక్తి కడుతోంది.

మొన్నటి న్యూ ఇయర్ వేడుక సందర్భంగా తాడిపత్రిలో మహిళలకు మాత్రమే అంటూ జేసీ ఓ ప్రకటన చేస్తే… దానిపై మాధవీ లత భగ్గుమన్నారు. మహిళలకు మాత్రమే ప్రత్యేక వేడుకలేంటి?. అది కూడా తాడిపత్రిలో భద్రత అంతంతమాత్రంగా ఉండే… జులాయిలు అధికంగా తిరిగే ప్రాంతంలోనా అంటూ ఆమె విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలపై హై టెన్షన్ తో ఊగిపోయిన జేసీ.. మాధవీ లతపై బూతుల పర్వం అందుకున్నారు. గతంలో తాడిపత్రి వచ్చినప్పుడు ఎలా వ్యవహరించావో నా వద్ద వీడియోలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపగా.. ఓ మహిళగా మాధవీ లతపై తాను అలా మాట్లాడి ఉండకూదని చెప్పిన జేసీ సిన్సియర్ గానే సారీ చెప్పారు.

అప్పటిదాకా స్ట్రాంగ్ గానే కనిపించిన మాధవీ లత.. జేసీ సారీ వీడియో చూసినంతనే బోరుమన్నారు. కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్న మాధవీ లత ఒకానొక రోజు జేసీపై ఏకంగా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ, ఇతరత్రా చర్యలేవీ పోలీసులు చేపట్టలేదు గానీ.. ఇప్పుడు జేసీ వంతు వచ్చినట్టుంది. తాడిపత్రికి చెందిన టీడీపీ మహిళా నేత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ.. మాధవీ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతీశారంటూ మాధవీ లతపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో… వీరి మధ్య సయోధ్య ఎప్పుడు కుదురుతుందో చూడాలి.