రాజా వారికి కుర్చీ ఖాయం: పెరిగిన మ‌ద్ద‌తు

ఏపీలో ఈ నెల 27న జ‌ర‌గనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్‌, ఉర‌ఫ్ రాజాకు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు పెరిగింది. ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణాజిల్లాల గ్రాడ్యుయేట్ అభ్య‌ర్థిగా రాజా బ‌రిలో నిలిచారు. ఈ క్ర‌మంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్న‌ట్టు ఉద్యోగ‌, సామాజిక వ‌ర్గాల కు చెందిన సంఘాలు ప్ర‌క‌టించారు.

తాజాగా 26 జిల్లాల నుంచి బీసీ కుల సంఘాల నాయకులు వచ్చి రాజాకు మద్దతు ప్ర‌క‌టించారు. ఎమ్మె ల్సీ ఎన్నికల్లో మద్దతు కోరడంతో బీసీ సంఘం తరఫున ఆలపాటికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామ‌ని నాయ‌కులు తెలిపారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీసీ గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌కు సంఘం నాయ‌కులు పిలుపునిచ్చారు. బీసీల పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ సోదరులకు చట్టం ఎలా ఉందో, అలా బీసీల కోసం కఠిన చట్టం చేయాల‌ని.. అందుకే తాము మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా రాజా మాట్లాడుతూ.. జనాభాలో సగభాగంగా బీసీలు.. తన గెలుపులో భాగస్వామ్యమవుతు న్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమ‌ని పేర్కొన్నారు. కూటమి ప్ర‌భుత్వం ఏర్పాటులో బీసీ ల పాత్ర ఎంతో ఉందని ఈ సంద‌ర్భంగా తెలిపారు. నిరుద్యోగ పట్టభద్రులకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా త‌న పాత్ర ఉంటుంద‌న్నారు. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌న్నారు.

మ‌రోవైపు.. రాష్ట్ర బీజేపీ కూడా.. ఆల‌పాటి రాజాకు మద్ద‌తు ప్ర‌క‌టించింది. అదేవిధంగా ఉద్యోగ సంఘాల నాయ‌కులు కూడా రాజాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నామ‌ని.. ప్ర‌తి ఉద్యోగీ రాజా గెలుపు కోసం ప్ర‌య‌త్నించా ల‌ని, మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా.. ఈ నెల 27న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల పోలింగ్లో వైసీపీ పీడీఎఫ్ అభ్య‌ర్థి..కేఎస్ ల‌క్ష్మ‌ణ రావుకు మ‌ద్ద‌తు ఇచ్చింది. వైసీపీ ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే.