జగన్ తో రోజా భేటీ… ‘గాలి’కి గ్రీన్ సిగ్నలా? బ్రేకులా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం భేటీ అయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగన్ ఆ తర్వాత తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సలీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని సభకు ఇంకేం హాజరవుతాం… ఇకపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందాం అంటూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పక్కనే తన ఇంటికి జగన్ చేరుకోగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న రోజా.. జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీపై పలు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

చిత్తూరు జిల్లాలోని నగరి కేంద్రంగా రోజా రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ మోస్ట్ నేత దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు చేతిలో పరాజయం పాలైన ఆమె… ఆ తర్వాత ఆయననే ఓడించారు. ఆ తర్వాత ముద్దు కృష్ణమ పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాశ్ ను కూడా ఓడించిన రోజా… మొన్నటి ఎన్నికల్లో ఆయన చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో కూడా టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది.

ఇదే సమయంలో ముద్దు కృష్ణమ రెండో కుమారుడు గాలి జగదీశ్ ప్రకాశ్ కూడా రాజకీయంగా యాక్టివేట్ అయ్యే దిశగా పక్కా వ్యూహాలు రచించుకున్నారు. తన సోదరుడు ఎలాగూ టీడీపీలో ఉన్నాడని.. అందులో తనకు ఇంకే ప్రాధాన్యం దక్కదని భావించి వైసీపీలో చేరే దిశగా సాగారు. వైసీపీ కీలక నేత, రోజా అంటే గిట్టదని ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మంత్రాంగం నెరపిన జగదీశ్.. వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ సాధించారు. ఇప్పటికే ఆయన ఓ సారి జగన్ ను తాడేపల్లిలో కలిశారు కూడా.

ఇలాంటి నేపథ్యంలో జగన్ తో రోజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నగరిలో తాను ఉండగా… జగదీశ్ ను ఎలా చేర్చుకుంటారని గతంలోనే ఆమె వైసీపీ అధిష్ఠానం వద్ద పెద్ద పంచాయతీనే పెట్టారట. ఈ కారణంగానే ఇటీవల జగన్ తో జగదీశ్ కలిసినా కూడా జగదీశ్ చేరికను తర్వాత చూద్దామంటూ జగన్ వాయిదా వేసినట్టు సమాచారం. వైసీపీలోకి జగదీశ్ చేరికపై అటోఇటో తేల్చుకుందామన్న భావనతోనే సోమవారం రోజా నేరుగా తాడేపల్లికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారన్ వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ పిలిస్తేనే… రోజా సోమవారం తాడేపల్లి వచ్చారన్న మరో ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే నగరిలో రోజాకు ఇంటి పోరు ఓ రేంజిలో ఇబ్బంది పెడుతోంది. ఈ విషయాన్ని కాస్తంత వివరంగా చెప్పి జగదీశ్ చేరికకు రోజాను ఒప్పించేందుకే జగన్ ఆమెను పిలిపించారని సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ తో రోజా భేటీ.. వైసీపీలో జగదీశ్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?.. లేదంటే బ్రేకులేసిందా? అన్న దానిపై చర్చ సాగుతోంది.