కేంద్రమంత్రికి విరిగిన సీటు వేసిన ఎయిర్ ఇండియా

ఇప్పుడు నేషనల్ మీడియాలో ఓ అంశంపై పెద్ద రచ్చ నడుస్తోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎయిర్ ఇండియా తన విమానంలో విరిగిన కుర్చీని కేటాయించిందట. ఇప్పుడైతే కేంద్ర మంత్రి గానీ… గతంలో చౌహాన్ చాలా కాలం పాటు మధ్య ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మిస్టర్ క్లీన్ నేతగా అందరి మన్ననలు అందుకున్న చౌహాన్.. ఎయిర్ ఇండియా తనకు విరిగిన… లేదంటే చిరిగిన సీటు ఇచ్చినంతనే తీత్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదేం పద్దతి… విరిగిన సీటు ఇవ్వడం అంటే వినియోగదారులను మోసం చేయడమే కదా అంటూ ఆయన ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారట. అంతటితో ఆగని ఆయన ఎయిర్ ఇండియా విమానంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో వివరించారు.

మధ్యప్రదేశ్ వేదికగా రాజకీయం చేసిన చౌహాన్… రాష్ట్ర స్థాయి రాజకీయాలను దాటేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్ లో కీలకమైన వ్యవసాయ శాఖ పగ్గాలను దక్కించుకున్న చౌహాన్ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. విధి నిర్వహణలో ఎంతమాత్రం అలసత్వం చూపని చౌహాన్.. అత్యవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వేగంగా కదులుతారని చెప్పాలి. సమస్యల తీవ్రతను ఇట్టే గుర్తించగలిగే సామర్థ్యం ఉన్న చౌహాన్… మొన్న ఏపీ మిర్చి రైతుల సమస్యను పట్టుకుని సీఎం చంద్రబాబు ఢిల్లీలోని తన కార్యాలయానికి వస్తే.. తాను అందుబాటులో లేకున్నా… అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయించి తాను కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. ఆ తర్వాతి రోజు నేరుగా ఏపీకి చెందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని పిలిపించుకుని మరీ సమస్య పరిష్కారాన్ని గంటల వ్యవధిలో తేల్చేసిన సంగతి తెలిసిందే.

అంతటి పనిమంతుడైన చౌహాన్.. విమానంలో చిరిగిన సీటు ఇచ్చారంటూ ఓ లెంగ్తీ పోస్టు పెట్టడం… విరిగిన సీటు ఇవ్వడం అంటే మోసగించడమే కదా అని వ్యాఖ్యలు చేయడం.. దానిపై నేషనల్ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారం కావడం నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై ఓ రేంజిలో రచ్చ సాగుతోంది. ఇటీవలే టాటాల నేతృత్వంలోకి వచ్చిన ఎయిర్ ఇండియాలో ఇలాంటి వింత అనుభవాలు సర్వసాధారణమేనని ఒకరు అంటే… అబ్బే అదేమీ లేదు.. ఇతర విమాానాల కంటే ఎయిర్ ఇండియాలో సేవలు బాగానే ఉంటాయంటూ మరొకరు వ్యాఖ్యానిస్తున్నారు. వెరసి చౌహాన్ తనకు ఎదురైన అనుభవంపై పెద్ద చర్చకే తెర లేపారని చెప్పాలి.