పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!: ర‌ఘురామ‌

“ఏం ర‌వి.. ఏం కోరుకుంటున్నావ్‌.. పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!“ – ఇదీ.. ఉత్త‌ర‌ప్ర‌దే శ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ‌మేళాకు వెళ్లిన‌.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ రాజు చేసిన వ్యాఖ్య‌. అది కూడా.. టీడీపీ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బీటెక్ ర‌విని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు! దీనిపై ర‌వి కూడా హ్యాపీగా ఫీల‌య్యారు. అంతేకాదు.. అదే ప‌రిస్థితి వ‌స్తే.. ర‌ఘురామే నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా రావాల‌ని ఆకాంక్షించ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది..?

మహాకుంభ‌మేళాకు.. ర‌ఘురామ‌కృష్ణ‌రావు, బీటెక్ ర‌వి, మంత్రి నారా లోకేష్ దంప‌తులు అదేవిధంగా సీఎం ర‌మేష్ స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా.. నారా లోకేష్ దంప‌తులు వేరుగా.. యాత్ర‌ను కొన‌సాగించారు. ర‌ఘురామ‌, బీటెక్ ర‌వి ఒక బృందంగా ఏర్ప‌డ్డారు. వీరిరువు క‌లిసి ప్ర‌యాగ్ రాజ్‌లో ఈ రోజు ఉద‌యం స్నానం చేసి.. అక్క‌డే ఉన్న పురాత‌న మ‌ర్రి వృక్షానికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగానే ర‌ఘురామ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

పులివెందులకు ఉప ఎన్నిక రావాలని మొక్కుకో.. అని రఘురామకృష్ణ‌రాజు అన్నారు. దీనికి ప్ర‌తిగా.. స్పందించిన బీటెక్ ర‌వి.. `ఉప ఎన్నిక వస్తే మీరు ఇన్ఛార్జ్ గా రావాలి“ అని రఘురామను ఉద్దేశించి చెప్పారు. దీనికి అంగీక‌రించిన ర‌ఘురామ‌.. సాధ్య‌మైనంత వ‌ర‌కు పులివెందుల ఉప ఎన్నిక వ‌స్తుంద‌న్న ఉద్దేశం త‌న‌కు ఉంద‌న్నారు. కాగా.. ఈ వ్యాఖ్య‌లపై నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. పులివెందుల ఇంచార్జ్‌గా ఉన్న బీటెక్ ర‌వికి విజ‌యాన్ని అందించే ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావాల‌ని.. కొంద‌రు వ్యాఖ్యా నించారు.

కానీ, మ‌రికొంద‌రు మాత్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో పుణ్య‌స్నానానికి వెళ్లినా.. అక్క‌డా రాజ‌కీయాలేనా? అని పెద‌వి విరుస్తున్నారు. ఇదిలావుంటే.. పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. సుదీర్ఘ కాలంగా ఇక్క‌డ వైఎస్ కుటుంబ‌మే విజ‌యం ద‌క్కించుకుంటోంది. ఈ క్ర‌మంలో టీడీపీ ఈ ద‌ఫా అయినా విజయం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.