సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కారు

టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే… వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగిస్తారంటూ ప్రచారం సాగింది. సచివాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థను తొలగించినట్లుగానే సచివాలయ ఉద్యోగులను కూడా ఇంటికి పంపుతారంటూ జోరుగా ప్రచారం సాగింది.

ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. వాలంటీర్ల మాదిరిగా తామేమీ వైసీపీ నేతలు ఎంపిక చేసిన వారం కాదని, ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత సాధించి మరీ కొలువుల్లో చేరామని వారు వాదిస్తున్నారు.

ఈ విషయాలపై కూటమి సర్కారు కూలంకషంగానే పరిశీలన చేసింది. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ తనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుందని తీర్మానించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఆ వ్యవస్థ ఏర్పాటు కూడా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు జరగలేదని భావించారు.

ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే… వైసీపీ చేసిన తప్పులను కొనసాగించినట్టు అవుతుందని కూడా ఆయన గ్రహించారు. ఈ కారణంగానే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే అంశాన్ని చంద్రబాబు పక్కనపెట్టేశారు. ఇక సచివాలయ వ్యవస్థపై దృష్టి సారించిన చంద్రబాబు.. దాని కొనసాగింపునకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.

చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి… దఫదఫాలుగా అధికార యంత్రాంగంతో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తేనే మంచిదని ఆయన ఇటీవలే చంద్రబాబుకు ఓ నివేదిక సమర్పించారు. ఈ నివేదికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు చెందిన సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని ఆయన సంచలన ప్రకటన చేశారు. అయితే ఉద్యోగుల విద్యార్హత, సీనియారిటీ ఆధారంగా రేషనలైజేషన్ చేస్తామని వెల్లడించారు. ఇందుకు ఉద్యోగుల సంఘాలు కూడా సమ్మతమేనని ప్రకటించి.. తమ ఉద్యోగాలపై గుడ్ న్యూస్ చెెప్పిన చంద్రబాబు సర్కారుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.