ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ ధీమా

తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం రివాజు. అయితే అందుకు విరుద్దంగా తెలంగాణాలో విపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఉప ఉన్నికలకు ఉవ్విళ్లూరుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ఉప ఎన్నికలను అందుకు వినియోగించుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా ఎన్నికలు ముగియగానే తనకు షాక్ ఇచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా ఆ పార్టీ రంగం సిద్ధం చేసింది.

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన బీఆర్ఎస్.. తొలి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం అందినట్టే అంది… స్వల్ప మార్జిన్ లో చేజారిపోయింది. ఈ పరాభవం నుంచి తేరుకునేలోపే తమ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది అధికార కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోయింది. గతంలో తాను కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినా ఎందుకనో.. తన గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిన వైనాన్ని ఆ పార్టీ సహించలేకపోయింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తోంది.

ఈ విషయంపై బీఆర్ఎస్ ప్రస్తుతం సుప్రీం కోర్టులో పోరాటం చేస్తోంది. బీఆర్ఎస్ పోరాటం ఫలించే సూచనలు కూడా స్పస్టముగానే కనిపిస్తున్నాయి. అందుకే… రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం అంటూ అటు కేటీఆర్ తో పాటు ఇటు కేసీఆర్ కూడా ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా కేసీఆర్ ఇదే మాటను మరో మారు చెప్పారు. తనను కలిసేందుకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో ఆయన ఇదే విషయాన్ని చెప్పారు, ఉప ఎన్నికలు రావడం ఖాయమని.. ఆ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయమని కూడా ఆయన చెప్పారు. ఇలా వరుసబెట్టి ఇటు కేసీఆర్, అటు కేటీఆర్ పదేపదే ఉప ఎన్నికల మీద మాట్లాడుతుంటే రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.