ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 27 ఏళ్ళ అనంతరం ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుండడంతో ఆ ప్రభావం నేషనల్ పాలిటిక్స్ పై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఓటమిని ఎదుర్కొంటుండగా, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ సెక్రటేరియట్ను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా, ఆప్ ప్రభుత్వం కీలక ఫైళ్లు గల్లంతు కాకుండా చూడటమే ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తికావడంతోనే లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్, శీష్ మహల్ ఖర్చుల వివాదం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఆప్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఇదే సమయంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాగ్ నివేదికలు అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలైనట్టేనని భావిస్తున్నారు. ఇక ఫలితాల విషయానికొస్తే, ఢిల్లీలో ఈసారి ఓటర్లు పెద్ద మార్పునే తీసుకొచ్చారు. 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తన సొంత నియోజకవర్గమైన న్యూఢిల్లీలో ఓటమి పాలయ్యారు.
అదే విధంగా, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జంగ్పురా నియోజకవర్గంలో పరాజయం చెందారు. ఆప్ మిగతా 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, బీజేపీ విజయం తథ్యమైపోయింది. కాంగ్రెస్ పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఆ పార్టీ ఏకంగా ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. గత ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రభంజనం కారణంగా ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్, ఈసారి బీజేపీ ఆధిపత్యానికి పూర్తిగా డౌన్ అయ్యింది. దీంతో, ఢిల్లీ రాజకీయాలు పూర్తిగా ద్విపాక్షిక పోరుగా మారాయి.
ఒక్కసారి బీజేపీ అధికారంలోకి రాగానే, ఆప్ పాలనలో జరిగిన అవినీతిపై పెద్ద ఎత్తున దర్యాప్తు జరిగే అవకాశముంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్, అవినీతి కేసుల్లో నేరుగా కీలక నేతలు ఫోకస్ అవుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సెక్రటేరియట్ సీజ్ చర్యలతో బీజేపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే కీలక ఆధారాలు వెలుగులోకి రావచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కేజ్రీవాల్ కోసం ఎంత నిరాశ కలిగించాయో, బీజేపీకి అంతంత ఉత్సాహాన్నిస్తోంది.