ఢిల్లీలోనూ చంద్ర‌బాబు ‘విజ‌న్’ మంత్రం

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున చంద్ర‌బాబు బీజేపీ అభ్య‌ర్థులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. విజ‌న్ మంత్రాన్ని జ‌పించారు. 1995లో విజ‌న్‌-2020 పేరు తో తీసుకున్న ఆర్థిక ఫ‌లాలు.. హైద‌రాబాద్‌ను ఇప్పుడు అగ్ర ఆదాయ న‌గ‌రంగా తీర్చిదిద్దాయ‌ని చెప్పారు. ఇప్పుడు విజ‌న్- 2047తో ముందుకు సాగుతున్నామ‌ని వివ‌రించారు. అభివృద్ధిలో ఢిల్లీ వెనుక‌బ‌డి పోయింద‌న్నారు.

అంతేకాదు.. ఆమ్ ఆద్మీ పాల‌న‌పైనా చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. “ఢిల్లీ అభివృద్ధి చేశామ‌ని చెబుతున్న కొంద‌రు.. కేవ‌లం పాఠ‌శాల‌ల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, అభివృద్ధి అంటే అన్ని మార్గాల్లోనూ జ‌ర‌గాల్సిన ప్ర‌క్రియ దీనిని విస్మ‌రించి.. అక్ర‌మాల్లో కూరుకుపోయార‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లే చెబుతున్నారు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతోపాటు రాజ‌కీయ కాలుష్యం కూడా పెరిగిపోయింద‌న్నారు. విక‌సిత భార‌త్ దిశ‌గా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌యాణం చేస్తుంటే.. విక‌సిత అవినీతి దిశ‌గా ఇక్క‌డి(కేజ్రీవాల్‌) నాయ‌కులు ప‌రుగులు పెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

అభివృద్ధికి తెలుగు వారంతా అండగా ఉంటున్నార‌ని ఏపీ ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు అభివృద్ధిని కోరుకున్నార‌ని.. అలానే.. ఢిల్లీలోని తెలుగు వారు కూడా అభివృద్ధికి ప‌ట్టంక‌ట్టాల‌ని, ఆ అభివృద్ధి మోడీ విధానాల‌తోనే సాకారం అవుతుంద‌న్నారు. “ఢిల్లీలో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఇంటింటికీ వెళ్లి బీజేపీ గెలుపు దేశ చరిత్రకు మలుపు అనేలా చెప్పాలి. మన దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారు. ఆయనే మోడీ” అని చంద్ర‌బాబు చెప్పారు. కాగా.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు భారీ ఎత్తున తెలుగువారు త‌ర‌లి వ‌చ్చారు.

రాజ‌కీయ కాలుష్యంతో..

ఢిల్లీలో పెరిగిపోయిన వాయు కాలుష్యంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు దిన‌దిన‌గండంగా గ‌డుపుతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. అయితే.. రాజ‌కీయ కాలుష్యం పెరిగిపోవ‌డంతో పెట్టుబ‌డి దారులు.. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల‌కు త‌ర‌లిపోతున్నార‌ని పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాద‌న్న ఆయ‌న‌.. బీజేపీని గెలిపించుకోవ‌డం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. “మోడీ సార‌థ్యంలో 2047 నాటికి భారత్ నెంబర్ 1గా తయారవుతుంది. ఢిల్లీని చూస్తుంటే చాలా భాధగా ఉంది. 1993లో హైదరాబాద్ ఎలా ఉందో ఢిల్లీ ఇప్పుడు అలానే ఉంది. ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఉంటే ఢిల్లీ వాషింగ్‌టన్ లాగా ఉండేది” అని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు.