రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్రబుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదన్న విషయం స్పష్టమైంది. తాజాగా ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం బడ్జెట్.. సమగ్ర స్వరూపాన్ని చూస్తే.. అప్పులు చేయకతప్పదన్న సంకేతాలు వచ్చాయి. అసలు ఈ విషయాన్ని మంత్రే చెప్పుకొచ్చారు. 2025-26 వార్షిక బడ్జెట్లో చెప్పిన లెక్కలు చూస్తే.. ద్రవ్య లోటు.. జీడీపీలో 4.4 శాతంగా ఉంది. అంటే.. చేసే ఖర్చుకు, వచ్చే ఆదాయానికి మధ్య దాదాపు 24% తేడా ఉంది.
దీంతో మొత్తం బడ్జెట్లో 24 శాతం మేరకు వివిధ మార్గాలు(అంటే అప్పులు) ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇది బడ్జెట్లో పేర్కొన్న మేరకు 11.4 లక్షల కోట్లుగా ఉంది. ఈ మొత్తాన్ని మోడీ సర్కారు పూర్తిగా అప్పులు రూపంలో తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక, బడ్జెట్ మొత్తం అంచనా 50.65 లక్షల కోట్లు గా పేర్కొన్నారు. దీనిలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, కస్టమ్ డ్యూటీల ద్వారా 34.96 లక్షల కోట్లుగా ఉంది. మిగిలిన దానిలోనూ కొంత మేరకు ఇతర రూపాల్లో సమీకరించుకుంటున్నా.. 11.4 లక్షల కోట్లు మాత్రం ఖచ్చితంగా అప్పులు చేయాల్సి రావాల్సిందే.
ఇక, గత ఏడాది 2024-25లో మొత్తం రాబడి రూ.31.47 లక్షల కోట్లుగా ఉంటే.. మొత్తం ఖర్చు రూ.47.16 లక్షల కోట్లు.. 2024-25లో ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీలో 4.8 శాతంగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక, ఇప్పుడు 2025-26లో మొత్తం ఖర్చు అంచనా రూ.50.65 లక్షల కోట్లుగా పేర్కొనగా.. 2025-26లో మొత్తం రాబడి అంచనా రూ.34.96 లక్షల కోట్లుగా ఉంది. లోటు జీడీపీలో 4.4 శాతం. అంటే.. ఇది గత ఏడాదికంటే తక్కువ చూపించారు. కానీ, అప్పు చేయాల్సిన మొత్తం రూ.11.4 లక్షల కోట్లుగా పేర్కొనడం గమనార్హం. దీనిని బట్టి.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పదన్న సంకేతాలు ఇచ్చినట్టు అయింది.