జగన్ ఫిర్యాదుపై దేశవ్యాప్తంగా రాజుకుంటున్న వేడి

న్యాయవ్యవస్ధలోని కొందరు ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై దేశవ్యాప్తంగా వేడి రాజుకుంటోంది. ఫిర్యాదుకు అనుకూలంగాను, వ్యతిరేకంగా న్యాయనిపుణులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కొందరేమో ఫిర్యాదు చేసినందుకు జగన్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరేమో ఫిర్యాదుపై కచ్చితంగా విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ జరిపించాల్సిందే అంటూ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఇదే విషయమై జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు ప్రయోజనాలను రక్షించటం కోసమే సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు జస్టిస్ ఏకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలు ప్రభుత్వానికి వ్యతేకంగా ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు జగన్ ఫిర్యాదు చేశారు. సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి రాసిన లేఖలో తన ఆరోపణలకు ఆధారంగా జగన్ కొన్ని వివరాలను కూడా ఉదహరించారు. లేఖ రాయటమే కాకుండా తర్వాత దాన్ని మీడియాకు వెల్లడించటంతో ఒక్కసారిగా దేశంలో సంచలనం మొదలైంది.

ఎప్పుడైతే లేఖ విషయం బయటపడిందో అప్పటి నుండే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని న్యాయనిపుణులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు చేసిన ఫిర్యాదును మీడియాలో రిలీజ్ చేయటం అనైతికమంటూ ఢిల్లీ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. జగన్ ఫిర్యాదు న్యాయవ్యవస్ధ మీద దాడిగానే చూడాలని అసోసియేషన్ అభిప్రాయపడింది. సమైక్య రాష్ట్రంలో పనిచేసిన మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్ చర్య ముమ్మాటికి తప్పే అన్నారు.

ఇదే విషయమై ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ మాట్లాడుతూ జగన్ చర్యలో ఎటువంటి తప్పు లేదన్నారు. సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను బయటపెట్టడం అనైతిక చర్యేమీ కాదన్నారు. ఫిర్యాదు ఆధారంగా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ వెంటనే విచారణ చేయించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే న్యాయనిపుణులు జస్టిస్ ఏకే గంగూలీ, సీవీ మోహన్ రెడ్డి, జస్టిస్ బిశ్వజిత్ బెనర్జీ కూడా ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. మాడభూషి శ్రీధర్ కూడా జగన్ ఆరోపణలను డేర్ డెవిల్ యాక్ట్ అంటూ అభివర్ణించారు. చేసిన ఆరోపణల్లో కానీ లేఖను మీడియాకు విడుదల చేయటంలో కానీ జగన్ తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖరాసి వారం రోజులవుతున్నా ఇంతవరకు సుప్రింకోర్టు నుండి అధికారికంగా ఎటువంటి స్పందన రాలేదు. ఎప్పుడైతే సుప్రింకోర్టు నుండి ప్రకటన రాలేదో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని న్యాయనిపుణులు ఎవరి అభిప్రాయాలను వాళ్ళు జగన్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా మీడియాలో స్వేచ్చగా చెప్పేస్తున్నారు. దాంతో మామూలు జనాల్లో గందరగోళం పెరిగిపోతోంది. కాబట్టి ఈ గందరగోళానికి ఫులుస్టాప్ పడాలంటే వీలైనంత తొందరగా సుప్రీంకోర్టు స్పందిస్తే బాగుటుందని అభిప్రాయపడేవాళ్ళు కూడా ఉన్నారు.