కొత్త అధ్యక్షలపై అప్పుడే అసంతృప్తా ?

అనంతపురం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతల్లో అప్పుడే అసంతృప్తులు పెరిగిపోతున్నాయా ? జిల్లా రాజకీయాలు చాలా ఇంట్రస్టింగ్ గా మారిపోతున్నాయి. జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల జిల్లా అధ్యక్షులను చంద్రబాబునాయుడు ప్రకటించిన దగ్గర నుండి గుంభనంగా ఉన్న అసంతృప్తి మెల్లిగా బయటపడుతోందని సమాచారం. హిందూపురం జిల్లా నియోజకవర్గానికి అధ్యక్షునిగా మాజీ ఎంఎల్ఏ బికే పార్ధసారధిని అనంతపురం జిల్లా నియోజకవర్గం అధ్యక్షునిగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ను చంద్రబాబు నియమించారు. వీళ్ళద్దరినీ చంద్రబాబు నియమించటంలో కాస్త జగన్మోహన్ రెడ్డి ఫార్ములాను కాపీ కొట్టారనే చెప్పాలి.

మొన్నటి ఎన్నికల్లో పై నియోజకవర్గాల్లో ఎంపి అభ్యర్ధులుగా వైసిపి తరపున గోరంట్ల మాధవ్, రాజయ్యలను రంగంలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోను ఇద్దరు బీసీ అభ్యర్ధులను జగన్ వ్యూహాత్మకంగా పోటి చేయించటంతో ఇద్దరు కూడా మంచి మెజారిటితో గెలిచారు. నిజానికి జిల్లాలో జనాభా పరంగా చూస్తే బీసీలు, ఎస్సీలే ఎక్కువ. అయితే రాజకీయాధికారం మాత్రం మొదటి నుండి కమ్మ, రెడ్డి సామాజికవర్గాల చేతుల్లోనే ఉంది. జిల్లా చరిత్రను చూస్తే ఈ విషయం ఈజీగా అర్దమైపోతుంది.

ఇటువంటి నేపధ్యమున్న జిల్లాలోని ఎంపి సీట్ల విషయంలో జగన్ ప్రయోగాలు చేసి విజయం సాధించారు. అయితే ఇదే ప్రయోగాన్ని ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కాపీ కొట్టినట్లే ఉంది. ఇక్కడే చంద్రబాబు ఫార్ములాపై అందరిలోను అసంతృప్తి పెరిగిపోతోందట. బీకే పార్ధసారధి, కాలువకు అధ్యక్ష పదవులను కట్టబెట్టడాన్ని జిల్లాలోని కమ్మ, రెడ్డి సామాజికవర్గంలోని నేతలంతా మండిపోతున్నారట. జిల్లాలో మొదటినుండి రెడ్డి సామాజికవర్గంలో జేసి సోదరులదే ఆధిపత్యం. అలాగే కమ్మ సామాజికవర్గంలో తీసుకుంటే టీడీపీ ఏర్పడిన దగ్గర నుండి పరిటాల కుటుంబానిదే రాజ్యం. జేసి దశాబ్దాల పాటు కాంగ్రెస్ నేతగానే ఉండి 2014లోనే టీడీపీలో చేరారు. దానికి తగ్గట్లే అప్పటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటంతో జేసీ, పరిటాల వర్గాల హవానే నడిచింది.

ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వీళ్ళ హవాకు బ్రేకులు పడ్డాయి. దానికితోడు చంద్రబాబు కూడా రెండు నియోజకవర్గాల అధ్యక్షులుగా బీసీలనే నియమించటంతో రెడ్డి, కమ్మ సామాజికవర్గాల నేతలు మండిపోతున్నారని సమాచారం. నిజానికి వీళ్ళద్దరికీ జేసీ, పరిటాల వర్గాలను శాసించే స్ధాయిలేదు. జిల్లా మొత్తం మీద ఎక్కువగా వీళ్ళ వర్గాలే ఎక్కువగా ఉన్నారు. దాంతో అధ్యక్షులు ఎవరితోను మాట్లాడలేక అలాగని జేసి, పరిటాల వర్గాలు వీళ్ళ ఆధిపత్యంలో పనిచేయటానికి ఇష్టపడటం లేదట. అందుకనే వీళ్ళ మధ్య అసంతృప్తులు పెరిగిపోతున్నాయట. మరి చంద్రబాబు ఏమి చేస్తారో చూడాల్సిందే.