చంద్రయాన్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన దేశంగా భారత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని దేశంగా కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ కోవలోనే ఆంధ్రప్రదే్శ్ లోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం డోలీలే గిరిజనులకు గతి. అయితే, గిరిజనులకు ఆ దుస్థితి తప్పించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నడుం బిగించారు.ఏపీలో డోలీల మోతకు చెల్లుచీటీ పాడేందుకు పవన్ ప్రయత్నాలు మొదలుబెట్టారు.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలోని మారుమూల గిరిజన గ్రామాలకు కూడా పక్కా తారు రోడ్లు నిర్మించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తొలి దశలో ఆ జిల్లాల్లో 9 రోడ్ల నిర్మాణం జరపాలని అధికారులకు చంద్రబాబు, పవన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులకు గిరిజన గ్రామాల రహదారులను అనుసంధానించేందుకు దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో గిరిజనులకు డోలీ మోత నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. సరైన రహదారి లేక వాగులు, వంకలు దాటుకుంటూ కాలినడకన డోలీలో రోగులను మోసుకువెళుతున్న క్రమంలో ఎంతోమంది గిరిజనులు సకాలంలో వైద్యం అందక మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 499 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గ్రామంలో రోడ్ల పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో అన్ని గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు, పవన్ ముందుకు వెళుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates