వంగవీటి రాధాకు లోకేష్ బంపర్ ఆఫర్?

దివంగత కాపు నేత వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా వంగవీటి రాధా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2004లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన రాధా ఆ తర్వాత మరోసారి 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక, రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన రాధా మరోసారి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన రాధాకు 2024 లో కూడా సామాజిక సమీకరణాలు, కూటమిలో మిగతా పార్టీలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో టికెట్ దక్కలేదు.

ఈ నేపథ్యంలోనే దశాబ్ద కాలంగా టిడిపిని నమ్ముకొని ఉన్న రాధాను త్వరలోనే ఎమ్మెల్సీగా నామినేట్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న రాధాను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరామర్శించిన సందర్భంగా ఎమ్మెల్సీ హామీ లభించినట్లుగా పుకార్లు వస్తున్నాయి. అంతేకాకుండా, ఏపీ క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న బెర్త్ ను రాధాకు కేటాయించాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందని తెలుస్తోంది.

2024 ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గపు ఓట్లు కూడగట్టడంలో రాధా సక్సెస్ అయ్యారని, వైసీపీకి వ్యతిరేకంగా ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారని, ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్సీ కోటాలో మంత్రి చేయాలని కాపు సామాజిక వర్గం కోరుకుంటుంది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాను నామినేట్ చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా భావిస్తున్నారట. రాధాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఉమ్మడి కృష్ణా జల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, కోస్తా ప్రాంతంలో టిడిపికి లాభం చేకూరుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది.