కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం

మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పేను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో నాగార్జున, సమంతలతో కేటీఆర్ అసభ్యకరంగా వ్యాఖ్యానించారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా విచారణ ఈ రోజు కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా కొండా సురేఖపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాధ్యతగల మహిళా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓ మహిళా మంత్రి ఈ రకమైన కామెంట్లు చేయడం ఆశ్చర్యం కలిగించిందని కోర్టు వ్యాఖ్యానించింది. సమాజంపై ఈ తరహా వ్యాఖ్యలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయని, ఆమె వ్యాఖ్యలను ఇటు మీడియా, అటు సోషల్ మీడియా, యూట్యూబ్ ప్లాట్ ఫాంల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది.

కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రచారం చేసిన, ప్రచురించి మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను, వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఆ తరహా వ్యాఖ్యలు పబ్లిక్ డొమైన్ లో ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. అయితే, పరువు నష్టం కేసులో ఓ మంత్రి స్థాయి వ్యక్తిపై కోర్టు ఈ స్థాయిలో ఆగ్రహం, అసహనం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
గతంలో కూడా కొండా సురేఖ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినా సురేఖలో మార్పు రాలేదని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.