సమీక్ష – అంబాజీపేట మ్యారేజీ బ్యాండు

2.75/5

2 Hr 12 mins   |   Drama   |   02-02-2024


Cast - Suhas, Shivani Nagaram, Goparaju Ramana, Sharanya Pradeep, Jagadeesh and others

Director - Dushyanth Katikaneni

Producer - Dheeraj Mogilineni, Venkat Reddy

Banner - GA2 Pictures, DM Entertainment

Music - Shekar Chandra

ఒక చిన్న సినిమాకు మొదటి రోజు ఆడియన్స్ ని రప్పించడమే పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడం సాహసం. బేబీ లాంటి బ్లాక్ బస్టర్లు దాని వల్లే ప్రయోజనం సాధించినా కొన్నిసార్లు రివర్స్ అయిన దాఖలాలు లేకపోలేదు. కంటెంట్ మీద నమ్మకంతో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బృందం ప్రధాన కేంద్రాల్లో స్పెషల్ షోలు వేసింది. మెల్లగా ఎదుగుతూ జాగ్రత్తగా కెరీర్  ప్లాన్ చేసుకుంటున్న సుహాస్ హీరోగా రూపొందిన ఈ విలేజ్ డ్రామా అంచనాలకు తగ్గట్టు ఆకట్టుకునేలా ఉందా

కథ

బ్యాండ్ మేళం వాయించుకునే మల్లి(సుహాస్), స్కూల్ టీచర్ పద్మ(శరణ్య ప్రదీప్) అక్క తమ్ముడు. పెద్ద కులానికి చెందిన లక్ష్మి(శివాని నాగారం)ని మల్లి ప్రేమిస్తాడు. ఆమె అన్నయ్య వెంకట్(నితిన్ ప్రసన్న) ఊళ్ళో అధిక వడ్డీలకు అప్పులిచ్చి అందరినీ పురుగుల కంటే హీనంగా చూస్తాడు. కొన్ని పరిణామాల వల్ల పద్మని దారుణంగా అవమానిస్తాడు వెంకట్. తిరగబడిన మల్లికి అదే జరుగుతుంది. దీంతో ఇద్దరూ ఒక్కటై మూకుమ్మడిగా అతన్ని ఎదురుకోవడానికి సిద్ధపడతాడు. ఈలోగా చెల్లి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న వెంకట్ పగతో రగిలిపోతాడు. మరి ముగ్గురి మధ్య మొదలైన యుద్ధం పల్లె జనంలో ఎలాంటి మార్పుకు దారి తీసిందనేది తెరమీద చూడాలి.

విశ్లేషణ

కుల వివక్షను ఆధారంగా చేసుకుని, భావోద్వేగాలను వాడుకుని వాటి ద్వారా మనుషులందరూ ఒకటేనని, తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని దర్శకుడు దుశ్యంత్ కటికనేని చెప్పాలనుకున్నాడు. వర్తమానంలో మరీ అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా అంటే సమాధానం చెప్పడం కష్టం కాబట్టి 2007 నేపధ్యాన్ని తీసుకున్నాడు. మొదలైన ముప్పావు గంట వరకు ఇదేదో ప్రేమకథనే ఇంప్రెషనే కలుగుతుంది. అక్క పాత్రని ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఆమెకూ వెయిట్ ఉంటుందని ఊహించేలా చేసినప్పటికీ లవ్ స్టోరీలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయోననే ఆసక్తితో కథనం సాగుతుంది. కానీ ఇది ప్రధానంగా బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ డ్రామా.

టేకాఫ్ లో ఒక ఇంప్రెషన్ ఇచ్చి ప్రీ ఇంటర్వెల్ నుంచి దాన్ని సమూలంగా మార్చేయడం ద్వారా దుశ్యంత్ కొత్త తరహా నెరేషన్ ని ప్రయత్నించాడు. అయితే తను రాసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. సీతాకోకచిలుక జమానా నుంచి జయం వరకు, ఇదే సుహాస్ నటించిన కలర్ ఫోటో దాకా ఎన్నో వచ్చాయి. ఆ దారిలో వెళ్తే రొటీన్ అవుతుందని గుర్తించిన దర్శకుడు అంబాజీపేట మ్యారేజీ బ్యాండుని అక్కాతమ్ముళ్ల బంధం మీద నడిపించాడు. ఊరికో పెత్తందారు, సినిమా మధ్యలో అతని మీద తిరగబడే కథానాయకుడు, కుటుంబానికి జరిగే అన్యాయం ఇలా రొటీన్ టెంప్లేట్ లోనే సాగినా దర్శకుడు దుశ్యంత్ ఎమోషన్ మీద ఎక్కువ ఆధారపడ్డాడు.

ఫస్ట్ హాఫ్ లో పెద్దగా సమస్యలేం లేవు. మల్లి, లక్ష్మిల ప్రేమకథ మాములుగా జరుగుతుంది. వీళ్ళ చుట్టుపక్కల పాత్రల ద్వారా కామెడీ పండించే అవకాశమున్నా దుశ్యంత్ దాని మీద ఫోకస్ పెట్టలేదు. వినోదం పాళ్ళు తక్కువ మోతాదులో ఉన్నాయి. ఎప్పుడైతే విలన్ వెంకట్, పద్మ మధ్య సంఘర్షణ మొదలవుతుందో ఒక్కసారిగా గ్రాఫ్ పైకి లేస్తుంది. ఊహించినట్టే మల్లి ప్రతీకారానికి తెగబడటం బాగా పండింది. అయితే సమస్య సెకండ్ హాఫ్ లో వచ్చింది. కీలకమైన ట్రాజెడీ ఘట్టం తప్ప మిగిలిన గ్యాప్ ని ఎలా నడిపించాలో అర్థం కాక ధర్నా ఎపిసోడ్ ని కొంత సాగతీతకు గురి చేశాడు దుశ్యంత్. ఇక్కడ కొంచెం సినిమాటిక్ గా అలోచించి ఉంటే మంచి సీన్లు పడేవి.

పోలీస్ స్టేషన్ లో శరణ్య తిరగబడే సన్నివేశం లాంటివి ఇంకొన్ని పడి ఉంటే మాస్ కి కనెక్ట్ అయ్యే అంశాలు పెరిగి నెరేషన్ ఫ్లాట్ గా వెళ్లడాన్ని తగ్గించేది. పైగా చాలా సేపు పద్మనే హీరోగా మారిపోయి అంతా ఆమె చేసినట్టు అనిపిస్తుంది తప్ప మల్లిగాడు నిస్సహాయంగా మిగిలిపోవడం ఫ్లోని తగ్గించేసింది. రక్తం పంచుకుపుట్టిన తోడబుట్టువుకి జరిగిన అవమానానికి రక్తం మరిగేలా అతనేదో చేస్తాడని సగటు ప్రేక్షకుడు ఆశిస్తాడు. అయితే దానికి భిన్నంగా ప్రాణానికి ప్రాణం సమాధానం కాదనే రీతిలో దుశ్యంత్ చెప్పాలనుకున్న మెసేజ్ స్క్రీన్ ప్లేని డామినేట్ చేసి నెమ్మదిగా వెళ్లేలా చేసింది. దీంతో ఎలివేషన్ ఉండాల్సిన చోట ఎమోషన్ ఎక్కువై ఇంప్రెషన్ తగ్గింది.

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఖచ్చితంగా మంచి ప్రయత్నమే. రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాని చూపించాలనుకున్నప్పుడు ఎమోషన్ ని మరీ ఎక్కువ భారంగా మార్చకూడదు. కథలో భాగంగా విషాదం రావాలి కానీ విషాదం నుంచే కథను నడిపించాలని చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేం. ఇందులో ఆ సమస్య ఉంది. అయినా సరే ట్రైలర్ చూశాక ఇందులో ఏం చూడబోతున్నామో ముందుగానే అంచనా వేసుకుని వెళ్లిన వాళ్ళను మల్లిగాడు మరీ అంత నిరాశపరచడు. కాసింత ఉద్వేగం, కూసంత ఆలోచన రేకెత్తించి పంపిస్తాడు. అంతకు మించి ఎక్కువ ఊహించుకుంటే మాత్రం ఇబ్బందే. పెర్ఫార్మన్సులు అడ్డుగా నిలబడి గోడ కూలిపోకుండా చూశాయి.  

నటీనటులు

సుహాస్ క్రమం తప్పకుండా తనలో నటుడిని సానబెడుతూనే ఉన్నాడు. పల్లెటూరి కుర్రాడు మల్లిగా చెలరేగిపోయాడు. సీరియస్ సన్నివేశాల్లో తన పరిణితి బాగా కనపడుతుంది. డాన్సులు మెరుగయ్యాయి. శరణ్య ప్రదీప్ కు మొదటిసారి పూర్తి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. దానికి తగ్గట్టే బాగా చేసింది. కొన్ని సీన్లలో సుహాస్ ని డామినేట్ చేసి స్క్రీన్ ని ఆక్రమించేసింది. శివాని నాగారంకు మొదట్లో కొంత ప్రాధాన్యం దక్కినా తర్వాత తగ్గిపోయింది. నటన ఓకే. పుష్ప జగదీశ్ కు మంచి నిడివి దొరికింది. వాడుకున్నాడు. విలన్ నితిన్ ప్రసన్న బాగానే కుదిరాడు కానీ బరువు ఎక్కువైపోయింది. గోపరాజు రమణ, స్వర్ణకాంత్ తదితరులు సహజంగా ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం

శేఖర్ చంద్ర సంగీతం చక్కగా దోహదపడింది. ఓవర్ సౌండ్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను నిలబెట్టడం బాగుంది.  యమ్మా పాట ఒకటే క్యాచీగా ఉంది. ఆల్బమ్ మొత్తం ఇదే స్థాయిలో ఉంటే ఆడియో హెల్ప్ అయ్యేది. వాజిద్ బేగ్ ఛాయాగ్రహణం ఉన్నంతలో పల్లె అందాలను బాగా ఆవిష్కరించింది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల టెక్నికల్ గా అతని పనితనాన్ని ఛాలెంజ్ చేసేది కాకపోయినా క్వాలిటీని పెంచడంలో బాగా దోహదపడ్డాడు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ వీలైనంత క్రిస్పీగా ఉంచేందుకు ప్రయత్నించింది. నిడివి కంట్రోల్ లోనే ఉంది. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. రిస్క్ తీసుకోకుండా ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

సుహాస్ & శరణ్య
తీసుకున్న పాయింట్
రెండు కీలక ఎపిసోడ్లు

మైనస్ పాయింట్స్

ఎమోషన్ల బరువు
కథ పాతదే
సెకండాఫ్ సమస్యలు
విలన్ క్యారెక్టరైజేషన్

ఫినిషింగ్ టచ్ : గట్టెక్కిన మల్లిగాడి పగ

రేటింగ్ : 2.75 / 5