గుంటూరు కారంకు మైనస్ – దేవరకు ప్లస్

కల్కి 2898 ఏడి తర్వాత బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చిన సినిమాగా దేవర విజయం అయిదు వందల కోట్ల గ్రాస్ ని దాటే దిశగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ముందు రోజు అర్ధరాత్రి ఒంటి గంటకు తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాలు అన్నింటిలోనూ ప్రీమియర్లు వేయాలని నిర్ణయిచుకున్నప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. టాక్ ఏ మాత్రం అటు ఇటు అయినా దెబ్బ పడుతుందని ట్రేడ్ టెన్షన్ పడింది. దానికి చెక్ పెడుతూ దేవర అనూహ్యంగా దూసుకుపోవడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. దీని గురించి లక్కీ భాస్కర్ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ ప్రత్యేకంగా మాట్లాడారు.

గుంటూరు కారంకు ముందస్తు షోలు వేయడం మైనస్ అయ్యిందని, వాటి వల్లే టాక్ దెబ్బ తిందని భావించామని, కానీ ఇలాంటి ఎర్లీ ప్రీమియర్లు ఫలితం ఎలాంటి ప్రభావం చూపించవనే కొత్త విషయాన్ని దేవర రుజువు చేసిందని, ఈ విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు ఉండవని కుండ బద్దలు కొట్టారు. ఇందులో నిజముంది. గుంటూరు కారంకు మిశ్రమ స్పందన వచ్చిన మాట నిజమే. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఆ స్థాయిలో కంటెంట్ లేకపోవడం అభిమానులే ఒప్పుకోలేకపోయారు. ఫలితంగా యావరేజ్ టాక్ మొదలయ్యింది.

ఒకవేళ దేవర రేంజ్ లో గుంటూరు కారంకు రెస్పాన్స్ వచ్చి ఉంటే గతంలో నాగవంశీ అన్నట్టు నాన్ రాజమౌళి రికార్డులు కొన్నయినా ఖచ్చితంగా దక్కేవి. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి సక్సెస్ మీట్ చేయలేదు. త్రివిక్రమ్ బయట కనిపించేందుకు ఇష్టపడలేదు. దేవర వల్ల కలిగిన మరో ప్రయోజనం ఉంది. రాబోయే రోజుల్లో పుష్ప 2, గేమ్ ఛేంజర్, విశ్వంభర, బాలయ్య 109 లాంటి పెద్ద సినిమాలన్నీ ధైర్యంగా అర్ధరాత్రి షోలకు జై కొట్టేస్తాయి. దీని వల్ల ఓపెనింగ్స్ భారీగా ఉండటంతో పాటు వీటికి వచ్చే పాజిటివ్ టాక్ పెద్ద ఎత్తున కలెక్షన్లు తెచ్చి పెడుతుంది. ఈ కోణంలో దేవర కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టే.