దెబ్బ మీద దెబ్బ.. ఇదైనా ఆడాలబ్బా

పీపుల్స్ మీడియా.. ప్రస్తుతం తెలుగులో హ్యాపెనింగ్ బేనర్. క్వాంటిటీ పరంగా చూస్తే మరే ప్రొడక్షన్ హౌస్ అందుకోలేని స్థాయిలో సినిమాలు తీస్తోందీ సంస్థ. కానీ క్వాలిటీ మీదే ఈ మధ్య సందేహాలు రేకెత్తుతున్నాయి. కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్థ.. మొదట్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. వేరే సంస్థల భాగస్వామ్యంలో సినిమాలు చేసింది. ఈ క్రమంలో గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ-2 లాంటి మంచి విజయాలు అందుకుంది.

ఆ తర్వాత సొంతంగా పెద్ద స్థాయిలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. ఈ సంస్థ నుంచి ఒకే సమయంలో ఏకంగా పాతిక చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయంటే దాని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే. ఐతే సొంత ప్రొడక్షన్లో చేసిన సినిమాల్లో ‘ధమాకా’ ఈ సంస్థకు మంచి విజయాన్నందించింది.

కానీ ఆ తర్వాత ఆ సంస్థకు సరైన విజయమే లేదు. గోపీచంద్‌తో చేసిన ‘రామబాణం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీసిన క్రేజీ మూవీ ‘బ్రో’ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒక్కో సినిమా బోల్తా కొడుతూ వచ్చింది. ఐతే మిస్టర్ బచ్చన్ తర్వాత తాము జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని.. వరుసగా తమ నుంచి క్వాలిటీ సినిమాలు రాబోతున్నాయని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.

కానీ ఈ సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ రిలీజ్ ‘శ్వాగ్’ కూడా నిరాశ పరిచింది. ప్రయోగాత్మక కథతో హాసిత్ గోలి చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. ఏదో ఓ మోస్తరుగా ఆడింది కానీ.. అంతిమంగా ఫలితం అయితే ఆశాజనకంగా లేదు. ఒక్క ఏడాదిలో ఇప్పటికే నాలుగు ఫ్లాపులు పడ్డ పీపుల్స్ మీడియాకు.. ఇప్పుడు ‘విశ్వం’ మీదే ఆశలు ఉన్నాయి. ఇది దసరా కానుకగా రిలీజవుతోంది. ఈ చిత్రమైనా బాగా ఆడి ఆ సంస్థను మళ్లీ విజయాల బాట పటిస్తుందేమో చూడాలి.