నాగార్జున ముందడుగు పెద్ద సాహసమే

మొన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ రేపిన వివాదం ఎంత దూరం వెళ్లిందో చూస్తున్నాం. నాగార్జున ముందు క్షమాపణ కోరడంతో ఆగుదామని ఆలోచించినా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటమే కాదు అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్ ని ఇరకాటంలో పెట్టేలా ఉండటంతో పరువు నష్టం దావా వేస్తూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నిజానికి ఇలా ఆధికార పార్టీ మినిస్టర్ మీద ప్రత్యక్ష యుద్ధానికి తలపడాల్సిన పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదనే చెప్పాలి. టాలీవుడ్ ముక్తకంఠంతో ఏకతాటిపైకొచ్చి ఈ సంఘటనను ఖండించగా అభిమానుల నుంచి నిరసన స్వరాలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.

కోర్టుకు వెళ్లడం ద్వారా నాగార్జున ఏ స్థాయి న్యాయం దక్కించుకుంటారనేది తర్వాత తేలుతుంది కానీ ఇది మాత్రం సాహసోపేత నిర్ణయమే. తమ కుటుంబం దీన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో నాగ చైతన్య, అఖిల్ లు ట్వీట్ల రూపంలో వ్యక్తం చేస్తుండగా అమల సైతం సున్నిత పదాలు కాకుండా ఎండగట్టే రీతిలో ప్రశ్నించడం అభిమానుల నుంచి భారీ మద్దతు దక్కించుకుంది. చిరంజీవితో మొదలుపెట్టి విశ్వక్ సేన్ దాకా అందరూ నిరసనలో భాగం కావడమే కాక తమ గళాన్ని గట్టిగా విప్పుతున్నారు. ఇక్కడితో వివాదం ముగిద్దామని కాంగ్రెస్ పెద్దలు కోరినా అప్పటికే వ్యవహారం న్యాయస్థానం మెట్లు ఎక్కేసింది.

ఒకరకంగా ఇదీ మంచిదే. రాబోయే రోజుల్లో ఇష్టం వచ్చినట్టు సినిమా స్టార్ల మీద నోరు పారేసుకుని ముందు తగిన ఆధారాలు ఉన్నాయో లేదో రాజకీయ నాయకులు చెక్ చేసుకుంటారు. వాళ్లకు కోర్టులు, వాయిదాలు కొత్త కాకపోవచ్చు. తీర్పులు ఎన్నో చూసి ఉండొచ్చు. కానీ ఫాలోయింగ్ ఉన్న హీరోలతో తలపడితే వాళ్ళ అభిమానుల దృష్టి చులకన కావడమనేది భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అందుకే ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని, హెచ్చరికను ఈ ఉదంతం ఇచ్చింది. మరి వాద ప్రతివాదాలు, జడ్జిల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.