వైట్ల నేర్చుకున్న ‘కామెడీ’ పాఠం

తెలుగు సినిమాల్లో కామెడీకి అత్యున్నత స్థాయి తీసుకొచ్చిన కొత్త తరం దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకడు. అతను కేవలం కామెడీ ప్రధానంగా సినిమాలు తీయలేదు కానీ.. వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాల్లో హైలైట్ అయింది మాత్రం కామెడీనే.

తన సినిమాల్లో వేరే అంశాలు కూడా ఉన్నప్పటికీ.. కామెడీ వల్లే అవి పెద్ద హిట్లయ్యాయి. ఐతే ‘దూకుడు’తో వినోదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన వైట్ల.. ఆ తర్వాత గాడి తప్పాడు. తన సినిమాలకు ప్లస్ అవుతూ వచ్చిన కామెడీ ట్రాకులే తర్వాత ప్రేక్షకులకు విసుగు పుట్టించాయి.

ఐతే తన కామెడీ ఎక్కడ తిరగబడిందో తనకు లేటుగా తెలిసిందని అంటున్నాడు వైట్ల. తన చివరి చిత్రాల్లో కామెడీ పండకపోవడానికి కారణం ప్రేక్షకులకు మొనాటనీ వచ్చేయడమే అని అంగీకరించాడు. ఓ ఇంటర్వ్యూలో తన కామెడీ ఫెయిలవడం గురించి అతను మాట్లాడాడు.

“నేను తీసినవి కామెడీ సినిమాలు కావు. కానీ చాలా సినిమాల్లో కామెడీ హైలైట్ అయింది. బాగా వర్కవుట్ అయింది. నాకు ‘ప్లే’ చేయడం చాలా ఇష్టం. హీరో కామెడీ క్యారెక్టర్లను వాడుకుని అందరితో ఆటాడుకోవడం బావుంటుంది. నేనీ కామెడీ బాగా డీల్ చేయగలను. చాలా సినిమాల్లో ఈ ప్లే హిలేరియస్‌గా వర్కవుట్ అయింది. నన్ను చూసి వేరే దర్శకులు కూడా ఇన్‌స్పైర్ అయి ఇలాంటి కామెడీ ట్రై చేశారు. ఒక దశాబ్దం పాటు ఈ తరహా కామెడీ బాగా వర్కవుట్ అయింది. కానీ నాతో పాటు అందరూ దీన్ని ఎక్కువ వాడేయడంతో ప్రేక్షకులకు ఒక దశ దాటాక మొనాటనీ ఫీలింగ్ వచ్చింది. హీరో ఒక ఇంట్లోకి వెళ్లి ఇలాంటి ప్లేతో కామెడీ చేయడం రొటీన్ అయిపోయింది. అందుకే ఒక దశ దాటాక ఈ కామెడీ వర్కవుట్ కాలేదు. నా సినిమాలు కొన్ని ఫెయిలవడానికి కూడా ఇదే కారణం. ఐతే ఇప్పుడు నేను ఆ తప్పు చేయలేదు. ‘విశ్వం’ సినిమా కోసం కొత్త థీమ్ తీసుకుని నా నుంచి ఆశించే కామెడీ ట్రాక్ పెట్టాను. ఇందులో ట్రైన్ నేపథ్యంలో వచ్చే అరగంట కామెడీ ట్రాక్ హిలేరియస్‌గా వచ్చింది. కానీ దీనికి ‘వెంకీ’కి పోలిక లేదు’’ అని వైట్ల తెలిపాడు.