ధూమ్ 4 హీరో దొరికేసాడు

బాహుబలి, కెజిఎఫ్, పుష్ప, కాంతార సీక్వెల్స్ కున్న క్రేజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ ఒక సినిమాకు కొనసాగంపు సక్సెస్ ఫుల్ గా ఎలా చేయవచ్చో నిరూపించిన బ్లాక్ బస్టర్ బాలీవుడ్ ధూమ్. ఈ సిరీస్ నుంచి 2004లో మొదటి భాగం వచ్చినప్పుడు ఆడియన్స్ తెరమీద చూపించిన కంటెంట్ కి షాక్ తిన్నారు. పేరుకి అభిషేక్ బచ్చన్ హీరో అయినప్పటికీ విలన్ గా నటించిన జాన్ అబ్రహంకే ఎక్కువ పేరు రావడం చూసి విశ్లేషకులకు నోట మాట రాలేదు. దెబ్బకు ధూమ్ 2లో కోరి మరీ విలన్ గా చేశాడు హృతిక్ రోషన్. అది అంచనాలకు మించి ఆడేసి కనక వర్షం కురిపించింది.

2013 లో రిలీజైన ధూమ్ 3కి ఏకంగా అమీర్ ఖాన్ రంగంలోకి దిగాడు. డ్యూయల్ రోల్ చేయడమే కాక పలు సాహసాలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. కమర్షియల్ గా హిట్టయ్యింది కానీ హైప్ పరంగా పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేకపోయింది. ఇదంతా జరిగి పదకొండు సంవత్సరాలు గడిచిపోయాయి. ధూమ్ 4 కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కానీ నిర్మాత ఆదిత్య చోప్రాది కథ విషయంలో రాజీపడని ధోరణి కావడంతో స్క్రిప్ట్ కోసమే ఏళ్ళ తరబడి ఖర్చు పెట్టారు. ఇప్పుడు దానికి రూటు క్లియరయ్యిందని లేటెస్ట్ అప్డేట్. 2025లో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని సమాచారం.

మెయిన్ లీడ్ గా రన్బీర్ కపూర్ ని దాదాపు లాక్ చేసినట్టు తెలిసింది. ధూమ్ 1, 2కి కథలు ఇచ్చి 3కి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్యతో కలిసి ఆదిత్య చోప్రా స్టోరీని ఒక కొలిక్కి తెచ్చారట. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూపించని యాక్షన్ విజువల్స్ ఇందులో కనిపిస్తాయట. బడ్జెట్ అయిదు వందల కోట్లకు పైమాటేనని అంటున్నారు. అభిషేక్ బచ్ఛన్, ఉదయ్ చోప్రా లాంటి మెయిన్ క్యాస్టింగ్ ని కొనసాగిస్తూ ఈసారి విలన్ గా యానిమల్ హీరోని పెట్టాలనే ఆలోచన మంచిదే. ప్రస్తుతం తను రామాయణం, బ్రహ్మాస్త్ర 2 , లవ్ అండ్ వార్ తో బిజీగా ఉన్నాడు. యానిమల్ పార్క్ పెండింగ్ లో ఉంది.