టార్గెట్ పవన్.. ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌‌కు.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు మధ్య ఇటీవల రాజుకున్న వివాదం కొంచెం పెద్దదయ్యేలాగే కనిపిస్తోంది. రాజకీయ పరమైన అంశాల మీద వీరి మధ్య గతంలోనే విభేదాలు తలెత్తాయి కానీ.. తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. ‘వకీల్ సాబ్’ కోసం ఇద్దరూ కలిసి పని చేశారు. కానీ ఇటీవల తిరుమల లడ్డు గొడవలో పవన్ అతిగా స్పందించి దీన్ని జాతీయ వివాదంగా మారుస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వేడి రాజుకుంది. దాని మీద పవన్ ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా మాట్లాడారు.

హిందువుల మనోభావాలు ముఖ్యం కాదా, దీని గురించి మేం మాట్లాడకూడదా అని ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించారు. ఐతే తన వ్యాఖ్యలను అపార్థం చేసుకుని వాటినే జనంలో తిప్పుతున్నాడంటూ పవన్‌ను తప్పుబట్టిన ప్రకాష్ రాజ్.. విదేశాల్లో ఉన్న తాను షూటింగ్ ముగించుకుని వచ్చాక పవన్ వ్యాఖ్యల మీద వివరంగా స్పందిస్తానన్నారు.

ఐతే ఈలోపే ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడం ఏంటో అంటూ.. ఇటీవల లడ్డు వ్యవహారం మీద ‘సత్యం సుందరం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్‌కు కార్తి సారీ చెప్పిన విషయం మీద వ్యంగ్యంగా స్పందించారు ప్రకాష్ రాజ్. ఐతే కార్తి సారీ చెప్పాక తాను ఉద్దేశపూర్వకంగా కార్తిని ఏమీ అనలేదంటూ పవన్ కళ్యాణ్ హుందాగా ఒక పోస్ట్ పెట్టిన విషయాన్ని ప్రకాష్ రాజ్ పట్టించుకోలేదు.

అంతటితో ఆగకుండా.. “గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఓ అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం” అంటూ పవన్‌ను టార్గెట్ చేస్తూ మరో పోస్ట్ కూడా పెట్టారు ప్రకాష్ రాజ్. ఐతే ‘ఎక్స్’లో ప్రకాష్ రాజ్‌కు పవన్ అభిమానులు దీటుగా బదులిస్తున్నారు. ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.