‘బిగ్ బాస్’ నుంచి దేవి ఔట్.. కొత్త టార్గెట్ రెడీ

‘బిగ్ బాస్’ నుంచి తాజాగా ఎలిమినేట్ అయిన టీవీ9 దేవి విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. షోనూ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా ఫాలో అవుతున్న వాళ్లు.. ఆమె హౌస్‌లో కొనసాగాల్సిన క్యాండిడేట్ అనే అభిప్రాయపడుతున్నారు.

టీవీ9 యాంకర్‌గా దేవికి ఉన్న ఇమేజ్‌కు, ఆమె నిజ జీవిత వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందని హౌస్‌లో ఆమెను పరిశీలించిన వాళ్లు చెబుతున్నారు. మరి దేవి ఎందుకు ఇంత త్వరగా ఎలిమినేట్ అయిపోయిందన్నది ప్రశ్న. జనసేనకు, పవన్ కళ్యాణ్‌కు టీవీ9 వ్యతిరేకంగా పని చేస్తోందన్న కోపంతో పవన్ అభిమానులే పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేసి ఓటింగ్‌లో పాల్గొని దేవి బయటికి వెళ్లేలా చేశారని వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలో జనసైనికుల పోస్టులు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.

ఇదిలా ఉండగా దేవి కథ ముగించాక పవన్ అభిమానులకు ఇప్పుడు కొత్త టార్గెట్ ఫిక్స్ అయినట్లు ట్విట్టర్లో వాళ్ల చర్చల్ని బట్టి అర్థమవుతోంది. టీవీ నటుడైన సోహెల్ వాళ్ల కొత్త టార్గెట్ అని తెలుస్తోంది. ఇందుక్కారణం అతను ఇంతకుముందు ఇచ్చిన ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ. అందులో అతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా చెప్పుకున్నాడు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డికి వీరాభిమాని అని.. తాను జగన్ ఫ్యాన్ అని.. ఆయన మామూలు లీడర్ కాదని.. యునీక్ అని.. గత ఎన్నికల్లో త్రుటిలో ఓడిపోయిన జగన్ ఈసారి భారీ మెజారిటీతో గెలిచాడని.. జగన్ ఒక మాట అన్నాడు అంటే ఛాలెంజ్ చేసినట్లే అని.. కరోనా టైంలో ఏపీలో ఒక్క కంప్లైంట్ కూడా లేదని.. అన్నీ పర్ఫెక్ట్‌గా నడుస్తున్నాయని.. దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం ఏపీనే అని.. ఇలా జగన్‌ను, ఆయన ప్రభుత్వాన్ని పొగుడుతూ చాలా ఎమోషనల్‌గా కనిపించాడు సోహెల్.

ఐతే జగన్ అంటే అస్సలు నచ్చని పవన్ ఫ్యాన్స్.. ఈ వీడియో పెట్టి మన నెక్స్ట్ టార్గెట్ సోహెలే అని ట్వీట్లు వేస్తుండటం గమనార్హం. ఐతే సోహెల్ జగన్ వీరాభిమాని అని తెలిసిన వైసీపీ మద్దతుదారులు సోహెల్‌కు మద్దతుగా పని చేసే అవకాశం కూడా ఉంది. మరి సోహెల్ ఎలిమినేషన్లోకి వచ్చినపుడు ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.