కొత్త దర్శకుడి మీదే మాస్ రాజా భారం

మాస్ రాజా రవితేజ కెరీర్ ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ఒకప్పుడు ఒకట్రెండు ఫ్లాపులు పడ్డా.. వెంటనే హిట్ కొట్టేవాడు. రెండేళ్లకు ఒక్క హిట్ అయినా పడేది. కొన్ని సినిమాలు యావరేజ్‌గా అయినా ఆడేవి. కానీ ఇప్పుడు వరుసగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తూనే ఉన్నాడు. హిట్టుకి హిట్టుకి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. ‘2022లో ‘ధమాకా’తో సక్సెస్ అందుకున్నాక రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్… ఇలా నాలుగు డిజాస్టర్లు ఇచ్చాడు మాస్ రాజా.

మిస్టర్ బచ్చన్ అయితే రవితేజ కెరీర్‌కు పెద్ద బ్రేకే వేసేలా కనిపించింది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా కరవయ్యాయి. పెట్టుబడిలో థియేటర్ల నుంచి పావు వంతు కూడా వెనక్కి రాలేదు. ఎన్నడూ లేని విధంగా నష్టాల భర్తీ కోసం రవితేజ తన పారితోషకంలో కొంత వెనక్కి కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా రవితేజ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపినట్లే కనిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో రవితేజ కెరీర్‌ను నిలబెట్టే బాధ్యత భాను భోగవరపు అనే కొత్త దర్శకుడి మీద పడింది. అతను ‘సామజవరగమన’ సహా కొన్ని కామెడీ చిత్రాలకు రచయితగా పని చేశాడు. భానును దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రవితేజతో ఓ సినిమాను కొన్ని నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీని గురించి ఏ అప్‌డేట్ లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయిపోయింది. ముందు ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ మధ్యలో రవితేజ గాయపడడడంతో షూట్ ఆగింది. దీంతో వేసవికి రిలీజ్ అనుకుంటున్నారు.

ఇందులో రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి పాత్ర పోషిస్తున్నాడట. ఇలాంటి పాత్రలో ఏం హీరోయిజం చూపిస్తారు.. కథ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరం. ఇది రవితేజ మార్కు మాస్ ఎంటర్టైనర్‌గా ఉంటూనే కొత్తదనం పంచుతుందని అంటున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ చేయబోతున్నారట.