డిజాస్టర్ సినిమాకు రిపేర్లు చేస్తున్నారు

కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినా సరే అన్ని భాషల్లో దారుణమైన డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఆయనది పేరుకి క్యామియోనే కానీ నిజానికి ఎక్కువ లెన్త్ ఉంది.

ఉదయం ఆటకే బొమ్మ భయపెట్టిందనే టాక్ రావడంతో సగటు ఆడియన్స్ థియేటర్ల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే లైకా సంస్థకు భారీ నష్టాలు తెచ్చిన చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే ఇంత కాలం గడిచినా అఖిల్ ఏజెంట్ లాగా ఈ లాల్ సలామ్ కూడా ఓటిటిలో రాలేదు. రాదనే ఫ్యాన్స్ ఫిక్సయ్యారు.

కట్ చేస్తే దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవలే పంచుకున్నారు. ప్రస్తుతం లాల్ సలామ్ కి రిపేర్లు చేస్తున్నారు. ఎడిటింగ్ లో మిస్సయిన ఫుటేజ్ ని కలిపి స్క్రిప్ట్ ప్రకారం ముందు రాసుకున్న వెర్షన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వచ్చేలా మొత్తం వర్క్ చేస్తున్నారు.

రీ షూట్ కాకపోయినా థియేటర్ లో చూడని సీన్లు, పాత్రలు ఈసారి ప్రత్యక్షమవుతాయి. పైసా అదనపు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏఆర్ రెహమాన్ మరోసారి ప్రత్యేకంగా రీ రికార్డింగ్ చేయడానికి ఒప్పుకోవడం మరో ట్విస్ట్. ఈ వర్క్ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.

అయినా చనిపోయిన పేషెంట్ కు ఎన్ని ఆపరేషన్లు చేసినా ఏం లాభమనే తరహాలో లాల్ సలామ్ కి ఇదంతా అవసరమా ని పెదవి విరుస్తున్న అభిమానులు లేకపోలేదు. పైగా ఇంకో పాతిక రోజుల్లో వెట్టయన్ రిలీజ్ ఉండగా ఇప్పుడీ ఫ్లాప్ మూవీ ముచ్చట్లు ఎందుకని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాల గ్యాప్ తర్వాత జీవిత రాజశేఖర్ నటించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఎంత ఎడిట్ చేసినా లాల్ సలామ్ తిరిగి ట్రోలింగ్ కి ఛాన్స్ ఇస్తుందే తప్ప ఇంకెందుకు ఉపయోగపడదని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ ఐశ్వర్య రజనీకాంత్ నమ్మకం మాత్రం వేరే స్థాయిలో ఉంది.