కమ్ముల దర్శకత్వంలో నాని?

ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఊపుమీదున్న కథానాయకుల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా ఏడాదిన్నర వ్యవధిలో మూడు పూర్తి భిన్నమైన సినిమాలతో అతను ప్రేక్షకులను మెప్పించాడు.

హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు నాని ‘హిట్-3’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకు ఇంకా స్క్రిప్ట్ లాక్ కాలేదు. నానికి వేరే కమిట్మెంట్లు కూడా కొన్ని ఉన్నాయి.

కానీ ఏది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. స్టార్ హీరోలకు మధ్యలో ఏదైనా మంచి కథ తగిలితే.. ఒక సినిమాను పక్కన పెట్టి కూడా ఆ చిత్రాన్ని మొదలుపెట్టడం మామూలే. ఇప్పుడు నాని కూడా అలాగే ఓ కొత్త సినిమాను తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం. విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ములతో నాని జట్టు కట్టబోతున్నాడన్నది తాజా కబురు.

శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్‌తో ‘కుబేర’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత నాని కోసం ఓ కథ రెడీ చేసినట్లు సమాచారం. ఇటీవలే నానికి కథ కూడా చెప్పాడని.. అతను వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. ఇందులో కమ్ముల ఫేవరెట్ హీరోయిన్ సాయిపల్లవి కథానాయికగా నటిస్తుందట. నాని, కమ్ముల కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలుంటాయి. ఇద్దరిదీ బాగా సూటయ్యే స్టైలే.

వీరికి సాయిపల్లవి కూడా తోడైందంటే సినిమా భలేగా తయారవడానికి అవకాశముంటుంది. ఆటోమేటిగ్గా ఒక క్లాసిక్ డెలివర్ చేస్తారని ఆశించవచ్చు. కమ్ములతో వరుసగా సినిమాలు తీస్తున్న ఏషియన్ మూవీస్ వాళ్లే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశముంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రావచ్చని అంచనా వేస్తున్నారు. ‘కుబేర’ వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే ఛాన్సుంది.