గేమ్ ఛేంజర్ పోరాటాలు….ఎంతైనా ఊహించుకోండి

ఇంకా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 రాబోతున్న సంగతి డిస్ట్రిబ్యూటర్ వర్గాలతో పాటు అభిమానులకూ క్లారిటీ వచ్చేసింది. రెండో ఆడియో సింగల్ ఈ నెలలోనే విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఇకపై ప్రమోషన్ల స్పీడ్ పెంచేందుకు దిల్ రాజు పక్కా ప్లాన్ తో ఉన్నారట. జనక అయితే గనక తమ ఇంటి బ్యానర్ నుంచే వస్తోంది కాబట్టి దాన్ని కొంచెం ప్రమోట్ చేసుకుని ఆ తర్వాత పూర్తి ఫోకస్ చరణ్ మూవీ మీదే పెట్టబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు శంకర్ నేతృత్వంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరాకి టీజర్ వచ్చే సూచనలున్నాయి.

ఇదిలా ఉండగా అందరూ అనుకుంటున్నట్టు గేమ్ ఛేంజర్ కేవలం పొలిటికల్ థ్రిల్లర్ మాత్రమే కాదని అంతర్గత లీక్స్ సమాచారం. మతిపోయే రేంజ్ లో భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. పూణే ట్రైన్ ఫైట్ వాటిలో ఒకటి కాగా 500 మందితో చిత్రీకరించిన క్లైమాక్స్ లో ఓ రేంజ్ మాస్ ఎలివేషన్స్ ఉంటాయని అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే మగధీర టైపు లో 1200 జూనియర్ ఆర్టిస్టులతో తలపడే ఫైట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనట. ఈ ఒక్క పోరాటానికి 15 కోట్లకు పైగా బడ్జెట్ తో పాటు దీని షూట్ కే నెల రోజులు పట్టిందని అంటున్నారు. ఇంతకన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంది.

ఈ లెక్కన గేమ్ ఛేంజర్ అంచనాలకు మించి అనే క్లారిటీ అయితే వస్తోంది. ఇప్పటిదాకా జరగండి జరగండి లిరికల్ సాంగ్, రెండు పోస్టర్లు తప్ప ఈ ప్యాన్ ఇండియా మూవీ నుంచి ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రాలేదు. అసలైన అప్పన్న గెటప్ ని ఇంకా రహస్యంగానే ఉంచారు. టైం ఉంది కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం ఒక్కొక్కటి రివీల్ చేయబోతున్నారు. తమన్ స్వరపరిచిన ఇతర పాటల మీద ఫ్యాన్స్ మాములు అంచనాలు పెట్టుకోలేదు. కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన గేమ్ ఛేంజర్ లో ఎస్జె సూర్య విలనీ మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. బడ్జెట్ మూడు వందల కోట్ల పైమాటే.