సప్తసాగరాల భామకు ఎనర్జిటిక్ అవకాశం

కన్నడలో మంచి అంచనాల మధ్య విడుదలై విజయం సాధించిన సప్తసాగరాలు దాటి సైడ్ ఏ, బిలు తెలుగులో ఆ స్థాయి విజయం నమోదు చేయనప్పటికీ కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. వాటిలో హీరోయిన్ గా నటించిన రుక్మిణి వసంత్ కు టాలీవుడ్ లోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. హోమ్లీ లుక్స్ తో పాటు చక్కని నటన కాంప్లిమెంట్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలువురు దర్శకులు నటింపజేయాలని చూశారు కానీ వర్కౌట్ కాలేదు. అనుదీప్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ప్రాజెక్టు ముందుకెళ్లి ఉంటే అందులో ఉండేది కానీ అది జరగకపోవడంతో డెబ్యూ ఆగిపోయింది.

తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రాబోయే ఎంటర్ టైనర్ లో తననే ఫైనల్ గా లాక్ చేసుకున్నట్టు సమాచారం. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ దాదాపుగా ఫిక్సైనట్టే. డబుల్ ఇస్మార్ట్ ఇచ్చిన షాక్ కి మౌనంగా ఉన్న రామ్ ఇంకా కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టలేదు. మేకోవర్ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఈసారి అక్కర్లేని మాస్ జోలికి వెళ్లకుండా వినోదానికి పెద్ద పీఠ వేస్తూ మహేష్ బాబు చెప్పిన స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రి మేకర్స్ దీని మీద మంచి బడ్జెట్టే పెట్టబోతున్నారని సమాచారం.

ఇక రుక్మిణి వసంత్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. విజయ్ సేతుపతి ఏస్ విడుదలకు రెడీ అవుతుండగా కెజిఎఫ్ నిర్మాతల బఘీరా నిర్మాణంలో ఉంది. శివరాజ్ కుమార్ భైరతి రణగల్ తో పాటు శివ కార్తికేయన్ మరో మూవీలో జోడిగా నటిస్తోంది. ఇవి కాకుండా తెలుగులో ఎంట్రీకి ఇప్పటిదాకా అడుగులు పడలేదు. ఇది ఓకే అయితే రామ్ సరసన డైరెక్ట్ ప్రమోషన్ అవుతుంది. గ్లామర్ షో చేయనంటున్న రుక్మిణి వసంత్ ఒకరకంగా సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటోంది. ఒక పెద్ద హిట్ పడాలే కానీ అందాల ఆరబోత అవసరం లేకుండానే సెటిలైపోవచ్చు